తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబం ఒక్కటేనా?: కిషన్‌ రెడ్డి

8 Mar, 2023 12:11 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు నేతలు స్పందించారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూ కౌంటర్‌ ఇచ్చారు. 

కాగా, కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈడీ నోటీసులతో మాకు సంబంధం లేదు. చట్టం ముందు అందరూ ఒక్కటే. కవితకు ఈడీ నోటీసులిస్తే తప్పేంటి?. దర్యాప్తు సంస్థల విషయంలో మేము జోక్యం చేసుకోము. అవినీతి అంశాన్ని తెలంగాణ సమాజంతో ముడిపెట్టి రెచ్చగొడుతున్నారు. ఈడీ కేసు విషయంలో నీతివంతులైతే గగ్గోలు  ఎందుకు పెడుతున్నారు?. కవితను తలవంచమని ఎవరు చెప్పటం లేదు. తప్పు చేయకపోతే నిజాయితీని నిరూపించుకోవాలి. తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబం ఒక్కటేనా?. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఢిల్లీకి వెల్లి లిక్కర్ వ్యాపారం చేసింది, సెల్ ఫోన్ పోన్లు పగల  కొట్టింది, అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. 

తమ తప్పిదాలు, అవినీతి, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం నాటకాలు చేస్తో​ంది. బీజేపీ, ప్రధాని మోదీని టార్గెట్‌ చేసి నిత్యం అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ఫ్యామిలీ అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతోంది. పోలీసులు.. భూముల సెటిల్మెంట్స్‌ చేస్తున్నారు. 

హైదరాబాద్‌లో వ్యాపారులను బెదిరించి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రభుత్వం నిర్భంధంలో ఉన్నారు. వారికి స్వేచ్చ లేదు. తెలంగాణలో ఇసుక, లిక్కర్‌, మైనింగ్‌ మాఫియా.. ప్రజలను శాసిస్తోంది. పాదయాత్రలు, బహిరంగ సభలపై నిర్బంధం విధిస్తున్నారు. కొనుగోలు చేయడంలో​ కేసీఆర్‌ దిట్ట. మహిళ అనే గౌరవం లేకుంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు ఆరోపణలు చేయడం విడ్డూరం. శాసనసభ ప్రగతిభవన్‌ కనుసన్నల్లో నడుస్తోంది. గతంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వాలు లేవు’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 

మరిన్ని వార్తలు