మంత్రి కొడాలి నాని
శ్రీశైలం టెంపుల్: కరోనా కట్టడికి లాక్డౌన్ మాత్రమే అంతిమ పరిష్కారం కాదని, ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్ను అడ్డుకోగలమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. సోమవారం మంత్రి ఆయన కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి దేశ, రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని మల్లన్నను కోరుకున్నట్లు చెప్పారు.
కరోనాతో సహజీవనం సాగించాల్సి ఉంటుందని దేశంలో ఏ ముఖ్యమంత్రీ చెప్పక ముందే సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. లాక్డౌన్ పెడితే పరిశ్రమలు మూతపడి ఉపాధి, ఉద్యోగాలు కోల్పోతారన్నారు. ప్రజల జీవనం ఛిన్నాభిన్నం అవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కరోనా వ్యాక్సిన్ అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో నాలుగు లక్షల మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబు, బీజేపీకి కూడా తెలుసని, అందుకే ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.