పవన్‌ ఎవరో రాసిచ్చిన డైలాగులు చదువుతున్నారు

5 Apr, 2021 04:26 IST|Sakshi

 రాష్ట్ర మంత్రి కొడాలి నాని  

గుడివాడ టౌన్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ఎవరో రాసిచ్చిన డైలాగులు చదువుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) విమర్శించారు. ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ..  పవన్‌ కల్యాణ్‌కు అవగాహనా రాహిత్యం రోజు రోజుకూ పెరుగుతోందన్నారు. సినిమా షూటింగ్స్‌లో డైలాగులు చెప్పడం అలవాటైపోయిన ఆయన వేదికపైకి వచ్చినప్పుడు వాటిని చదివే నేపథ్యంలో వాస్తవాలు మర్చిపోతున్నారన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య 2019 మార్చిలో జరిగితే.. ఆ ఏడాది మే వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు.

అప్పటి హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలను అప్పటి ప్రభుత్వమే సేకరిస్తుందన్న విషయం పవన్‌ కల్యాణ్‌కు తెలియకపోవడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ విచారణలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును తేల్చడం లేదని పవన్‌ అనడం చూస్తే ఆయనకు ఏ మాత్రం అవగాహన ఉందో సామాన్యునికి కూడా అర్థమవుతుందన్నారు. ఈ విధమైన డైలాగులే ఆయన స్క్రిప్ట్‌ చదువుతున్నాడనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు