కుక్కలు ఎవరు బాబూ!? 

11 Oct, 2021 03:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ నిరుపేదలంటే మీకు ఎందుకంత కడుపుమంట?’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో రెక్కాడితేగానీ డొక్కాడని 1.50 కోట్ల మంది నిరుపేదల ఖాతాల్లో సీఎం జగన్‌ వివిధ సంక్షేమ పథకాల కింద కోట్లాది రూపాయలను జమచేసి ఆదుకున్నారని చెప్పారు. రూ.రెండు లక్షల కోట్ల సంపదను కుక్కలపాలు చేశారంటూ ముఖ్యమంత్రిని చంద్రబాబు విమర్శించడంపై నాని తీవ్రంగా తప్పుబట్టారు. ‘నీ దృష్టిలో ఎవరు కుక్కలు? వైఎస్సార్‌ ఆసరా కింద లబ్ధిపొందిన కుటుంబాలా? అమ్మఒడి కింద ప్రయోజనం పొందిన తల్లులా? పెన్షన్‌ పొందుతున్న నిరుపేదలా? నవరత్నాలు కింద ఇళ్ల స్థలాలు పొందిన 30 లక్షల మంది మహిళలా?’ అని చంద్రబాబును నాని సూటిగా ప్రశ్నించారు. ‘అమరావతిలో 33 వేల ఎకరాలను రూ.5 లక్షల కోట్లతో అభివృద్ధి చేసి.. ఆ ప్రాంతంలోని 11 వేల మంది రైతులను కోటీశ్వరులను చేయడం నీ లక్ష్యమైతే.. 1.50 కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా దన్నుగా నిలవడం సీఎం వైఎస్‌ జగన్‌ విధానం’ అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. 2019 సాధారణ ఎన్నికలు మొదలు ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి.. జగన్, రాష్ట్ర ప్రజలపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. హెరిటేజ్‌ సంస్థ వాహనాల్లో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేయడమే కాక.. ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని దేశవ్యాప్తంగా సరఫరా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

డ్వాక్రా మహిళలను మోసం చేసిందెవరు?
2014లో గెలుపుపై నమ్మకం లేక డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, 90 లక్షల మంది మహిళలను మోసం చేశావు. డ్వాక్రా సంఘాల చరిత్రలో మోసగాడిగా నిలిచిపోతావు. నీవల్ల దారుణంగా దివాలా తీసిన డ్వాక్రా సంఘాలను తిరిగి బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారు. డ్వాక్రా సం«ఘాలను దోచుకుని ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడతావా? ఇక మత్స్యకారులు పడవల్లో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో వారు తిరగబడడంతో మీ పార్టీకి చెందిన పట్టాభి లాంటి పిరికిపందలు పారిపోయారు. చంద్రబాబూ.. పవన్‌తో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఏమీచేయలేవు. మీరిద్దరూ విశ్వసనీయతలేని నాయకులు. చివరికి బద్వేల్‌ ఉప ఎన్నికలో కూడా పారిపోయారు. 

చదవండి: (2024లో టీడీపీ పోటీ చేస్తుందో లేదో..) 

టీడీపీలో జనసేనను విలీనం చేస్తే..
► చంద్రబాబూ.. నీ కొడుకు నీ పార్టీని గట్టెక్కించలేడు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు.. వీడిని నమ్ముకుంటే పార్టీ సర్వనాశనం అవుతుందని భావించే కదా నీ దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ వైపు చూస్తున్నావు.
► ఎవరైనా పార్టీ పెడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు అండగా ఉంటామని చెబుతారు. కానీ, పవన్‌ మాత్రం కమ్మవారికి అండగా ఉంటాడంట. చందాల కోసమే కదా ఈ దందా? జనసేనను టీడీపీలో విలీనంచేస్తే దరిద్రం వదులుతుంది కదా? ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కమ్మవారికి ఎలాంటి ఇబ్బందిలేదు.. సంతోషంగా ఉన్నారు. అన్ని సంక్షేమ ఫలాలు కమ్మవారికీ అందుతున్నాయి. 

డ్రగ్స్‌ మాఫియా చంద్రబాబుదే..
అఫ్గానిస్తాన్‌ నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్‌ ఇంటికి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయని అంటాడా? అంతకుముందు తాలిబన్లతో చంద్రబాబు లింక్‌ పెట్టుకుని హెరిటేజ్‌ మాల్స్‌లో డ్రగ్స్‌ అమ్మి ఉంటాడు.. అందుకే పిచ్చికూతలు కూస్తున్నాడు. ఈ డ్రగ్స్‌ మాఫియా చంద్రబాబుదే. వీటికి అడ్డుకట్ట వేసేందుకు సీఎం వైఎస్‌ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందుకే చంద్రబాబు మానసిక స్థితి కూడా కోల్పోయాడు. 

చదవండి: (డ్రగ్స్‌ వ్యాపారంలో బాబు, లోకేశ్‌!)

మరిన్ని వార్తలు