తండ్రి చావుకు కారణమైన చంద్రబాబుతో షోలు చేస్తారా?
ఎన్టీఆర్ మరణించి 25 ఏళ్లు దాటినా ఇంకా క్షోభ పెడుతున్నారు
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
గుడివాడరూరల్: తండ్రి చావుకు కారణమైన చంద్రబాబు ఫ్యామిలీతో షోలు చేయడానికి నందమూరి బాలకృష్ణకు సిగ్గు ఉండాలని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. మహానటుడు ఎన్టీఆర్ మరణించి 25 ఏళ్లు గడిచినా చంద్రబాబు నేటికీ షోల పేరుతో ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తూ క్షోభ పెడుతున్నారని అన్నారు.
పార్టీని కాపాడినట్లు షోలు చేస్తున్న చంద్రబాబు కపట నాటక సూత్రధారి అని చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని నడపడం చంద్రబాబుకు చేతకాకపోతే బయటకు పోవాలన్నారు. జనసేన అధినేత పవన్కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అని, చిల్లర కోసం ఆశపడి చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నారని అన్నారు. గాజువాక ప్రజలు పవన్ను ఓడించి ఉమ్మేసినా సిగ్గు లేదన్నారు.
గాజువాకతోపాటు ఉత్తరాంధ్రపై కక్ష పెట్టుకున్న పవన్ పెయిడ్ అమరావతి రైతులు, టీడీపీ, బీజేపీ, తోక పార్టీలతో కలిసి ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు విశాఖ రాజధాని కావాలని కోరుతూ ఈనెల 15న చేపట్టే విశాఖ గర్జనను భగ్నం చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర పర్యటన పేరిట నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు.