ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తోంది

2 Sep, 2020 04:38 IST|Sakshi

చంద్రబాబు వెన్నుపోటుకు పాతికేళ్లు 

ఎన్టీఆర్‌కే కాదు.. ప్రజలకూ వెన్నుపోటు పొడిచారు

రాజకీయాల్లో సీఎం జగన్‌ హీరో.. బాబు విలన్‌

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాతికేళ్ల వెన్నుపోటుకు, తెలుగు తమ్ముళ్లు స్విలర్‌ జూబ్లీ పేరుతో పండుగ చేసుకోవటంతో దివంగత ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. పాతికేళ్ల వెన్నుపోటు సందర్భంగా పండగ చేసుకుంటున్న చంద్రబాబును చూసి సభ్య సమాజం తలదించుకుంటుందని చెప్పారు. ఎన్టీఆర్‌ పార్టీని, ఎన్టీఆర్‌ ఎన్నికల గుర్తుని, ఎన్టీఆర్‌ ట్రస్టును, ఎన్టీఆర్‌ సీఎం పదవిని లాక్కుని చరిత్ర హీనుడుగా చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలిలా ఉన్నాయి. 

► వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ విధానాలను వ్యతిరేకించి దమ్ము, ధైర్యంతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. సొంత జెండా, అజెండాతో, సొంత గుర్తుతో పార్టీ పెట్టారు. 151 సీట్లు సాధించి సీఎంగా ఏడాదిలోనే హీరోగా ప్రజల హృదయాల్లో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. 
► చంద్రబాబు.. ఎన్టీఆర్‌ వెనక గోతులు తవ్వి, కుట్రలు పన్ని ఆయన్ను పదవీచ్యుతుడ్ని చేశారు. అత్యంత నీచంగా చెప్పులతో కొట్టించే కార్యక్రమం చేశారు. ఇదే రోజు ఎన్టీఆర్‌ నుంచి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న చంద్రబాబు ప్రజల హృదయాల్లో విలన్‌గా మిగిలిపోయారు. 

చరిత్రకారుడు కాదు.. చరిత్ర హీనుడు
► 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతి రోజు ఆయన సమాధి వద్దకు వెళ్లి ప్రేమ ఒలకబోస్తూ నివాళులర్పిస్తారు. కానీ ఈ 14 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆయన పేరు భారతరత్న బిరుదుకు సిఫార్సు చేయలేదంటే చంద్రబాబు నైజం ఏంటో తెలుగు తమ్ముళ్లు ఆలోచించాలి.
► తెలుగుదేశం పార్టీని బాబు ఆక్రమించుకుని, కబ్జా చేసి 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ పాతికేళ్లలో 14 ఏళ్లు సీఎంగా, 11 ఏళ్లు ప్రతిపక్ష నేతగా బాబు ఒక్క మంచి కార్యక్రమం అయినా చేశారా?
► మీడియా మేనేజ్‌మెంట్‌లో ప్రపంచ స్థాయికి ఎదిగారు. మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలకు విలువ ఇవ్వకుండా ప్రతి ఒక్కరికీ వెన్నుపోటు పొడిచారు.

>
మరిన్ని వార్తలు