పీసీసీపై ప్రియాంకకు ఫిర్యాదు చేశా.. నేను ఉన్నానని భరోసానిచ్చారు

21 Dec, 2022 08:56 IST|Sakshi
నల్లగొండలోని ఉమెన్స్‌ డిగ్రీ కళాశాలలో ఫర్నీచర్‌ కోసం రూ.10 లక్షల చెక్కు అందజేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సాక్షి, నల్లగొండ రూరల్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పీసీసీ అధ్యక్షుడు ఎందుకు ప్రచారం చేయలేదో విచారణ చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తనకు తెలియకుండా మునుగోడులో సమావేశం పెట్టి తనను తిట్టడంపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. మార్ఫింగ్‌ వీడియోల కథ తేల్చాలన్నారు. ఆయన మంగళవారం నల్లగొండలో తన కుమారుడు ప్రతీక్‌రెడ్డి వర్దంతి సందర్భంగా ప్రభుత్వ కళాశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర పరిశీలకునిగా దిగ్విజయ్‌సింగ్‌ను నియమించడం సంతోషదాయకమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దిగ్విజయ్‌ నియామక విషయం ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌ చేసి చెప్పారని తెలిపారు. పీసీసీ వ్యవహార శైలిపై ప్రియాంక గాంధీకి తెలియచేశానని.. నేను ఉన్నానని ప్రియాంక గాంధీ తనకు భరోసా ఇచ్చినట్లు వెంకట్‌రెడ్డి చెప్పారు.

పీసీసీ అధ్యక్షుడి నియామకమై 20 మాసాలు అవుతున్నా జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించలేదన్నారు. గాంధీ భవన్‌ పైరవీకారులు ఇచ్చిన లిస్టును జిల్లా సీనియర్‌ నాయకులతో చర్చించకుండా కమిటీలు వేశారని ఆయన మండిపడ్డారు. నల్లగొండ జిల్లా కమిటీతోపాటు పీసీసీ కమిటీలో బలమైన నాయకులకు చోటు ఇవ్వలేదని ఆరోపించారు.  
చదవండి: పెళ్లి పేరుతో సంపన్న యువతులకు గాలం.. సీఐడీ, సీబీఐ, రా.. ఇలా అన్ని పేర్లతో

ఏపీ తరహాలో ఇక్కడ ఎందుకు చేయడం లేదు 
రైతుల కోసం జనవరి నుంచి పాదయాత్ర చేయబోతున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటానన్నారు. అనేక ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్‌ .. బి.వెల్లంల ప్రాజెక్టుకు, శ్రీశైలం సొరంగమార్గం పనులకు నిధులు ఇవ్వడం లేదని నిలదీశారు.లోటు బడ్జెట్‌ ఉన్న ఏపీలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెలిగొండ ప్రాజెక్టును చేపట్టి 36 కిలోమీటర్ల సొరంగాన్ని పూర్తి చేశారన్నారు. ఏపీ తరహాలో ఆరోగ్యశ్రీ ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. 

నల్లగొండలోని ఉమెన్స్‌ డిగ్రీ కళాశాలలో ఫర్నీచర్‌ కోసం రూ.10 లక్షల చెక్కు అందజేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  

మరిన్ని వార్తలు