‘రాష్ట్రంలో ఏ పార్టీకీ గెలిచే బలం లేదు. నేను బీజేపీలోనే ఉంటా’

28 Sep, 2023 12:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పాటు బీఆర్‌ఎస్, ఇతర పారీ్టలకు కూడా ఏకపక్షంగా గెలిచే బలం లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కొందరు బీజేపీ చాలా బలంగా ఉందని అనుకుంటారని, అయితే ఇంకా చేయాల్సింది చేస్తేనే ఎన్నికల్లో గెలిచే బలం వస్తుందనేది తమ అభిప్రాయమని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీలోనే తాను ఉంటానని, మరే ఇతర పారీ్టలోనూ చేరబోనని స్పష్టం చేశారు. బుధవారం కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండు, మూడు రోజులుగా మీడియాలో తాను ఇతర పారీ్టల్లో చేరుతున్నట్టు, నాయకులతో భేటీలు నిర్వహిస్తున్నట్టు కథనాలు రావడంతో పార్టీ నేతలు వివరణ నివ్వాలని సూచించారని చెప్పారు. తాను ఎలాంటి రహస్య సమావేశాలు నిర్వహించలేదని, ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి ఏం చేయాలనే దానిపైనే చర్చించామని చెప్పుకొచ్చారు. 

కేసీఆర్‌పై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోకుంటే నష్టమే 
కేసీఆర్‌ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఉపయోగించుకుని బీజేపీ ఈ బలా న్ని పెంచుకోవాలనేదే తమ ప్రయత్నమని చెప్పారు. దీనిని సరిగా ఉపయోగించుకోలేకపోతే ఓడిపోయే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై తమకున్న కొన్ని అనుమానాలపై స్పష్టతనివ్వాల ని అధిష్టానాన్ని కోరుతున్నామని చెప్పారు.

ఇప్పటికే రాష్ట్రపార్టీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్‌ జవదేకర్‌తో ఆయా అంశాలపై మాట్లాడామని, త్వరలోనే కేంద్రహోం మంత్రి అమిత్‌షాను కూడా కలుస్తామని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. కాగా, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబం డబ్బుతో కాంగ్రెస్‌ పార్టీని సులభంగా కొనుగోలు చేసే అవకాశం ఉందంటూ విశ్వేశ్వర్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. 
   

మరిన్ని వార్తలు