‘ఈటల కోసం ప్రచారం చేస్తా’

13 Jun, 2021 08:59 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ను హరీశ్‌రావుకు అప్పగిస్తే తిరిగి చేరుతా: విశ్వేశ్వర్‌రెడ్డి

తాండూరు టౌన్‌: రానున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో మాజీమంత్రి ఈటల రాజేందర్‌ తరఫున ప్రత్యక్షంగా ప్రచారం చేస్తానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసైనా అక్కడ విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శనివారం వికారాబాద్‌ జిల్లా తాండూరులో విలేకరులతో మాట్లా డారు.

కేసీఆర్, కేటీఆర్‌ కలసి రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పేస్థితిలో లేరని, టీఆర్‌ఎస్‌లో కట్టుబానిసత్వం కొనసాగుతోందని అన్నారు. తండ్రీ, కొడుకులను ఎదిరించే వారిని అణచివేస్తు న్నారని, అది ఈటల వ్యవహారంతో బట్టబయలైందని పేర్కొన్నారు.

తాను ఇంకా ఏ పార్టీలోకి వెళ్లాలనేది నిర్ణయించుకోలేదని, టీఆర్‌ఎస్‌ను  మంత్రి హరీశ్‌రావు వంటి వారికి అప్పగిస్తే మళ్లీ అందులో చేరేందుకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధిలో ఏపీ 3వ స్థానంలో ఉండగా, తెలంగాణ మాత్రం 11వ స్థానంలో ఉందని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో గత ఆరేళ్లుగా చివరిస్థానాల్లోనే ఉందన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పంటలు వానలపాలై రైతులు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ బడా నేతల అక్రమాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టు రఘును అరెస్టు చేసి జైలుకు పంపడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.
చదవండి: ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తా

మరిన్ని వార్తలు