'వెన్నుపోటు విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానం'

4 Aug, 2020 10:25 IST|Sakshi

సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు 48 గంటల సమయం ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందంటూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. మంగళవారం నరసాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఊడగొట్టిన మంచం కోడులా ఎక్కడో తెలంగాణలో ఉంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు 48 గంటల సమయం ఇస్తాను అనడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడుకు పూర్తిగా మతిభ్రమించింది. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడం ఆయనకు ఇష్టం లేదు. సీఎం జగన్‌ భారత రాజ్యాంగానికి లోబడే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప స్వార్ధంతో కాదని ముందుగా గమనించాలి. మూడు రాజధానుల విషయంలో వైఎస్‌ జగన్‌ ఎవరిని మభ్య పెట్టలేదు.. బహిరంగంగానే అసెంబ్లీలో చెప్పడం జరిగింది.

వెన్నుపోటు పొడిచారు.. మోసం చేశారు.. అనే అర్హత చంద్రబాబుకు లేదు. ఎందుకంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే వెన్నుపోటు దారుడుకు అర్హత గల వ్యక్తి చంద్రబాబు మాత్రమే. వెన్నుపోటు పొడిచే విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటారు. రాజీనామాలు చేయండని మాకు చెప్పడం కాదు.. దమ్ముంటే మీరు రాజీనామా చేసి.. మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిచి అప్పుడు చెప్పండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. మూడు రాజధానులు విషయంలో ప్రజలంతా స్వాగతిస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం, రియల్ ఎస్టేట్ కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు వల్ల రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందుతుంది' అంటూ సుబ్బారాయుడు పేర్కొన్నారు. (దమ్ముంటే రాజీనామా చేయాలి)

మరిన్ని వార్తలు