KTR Sircilla Tour: బీజేపీని బట్టలిప్పి తరిమి కొడదాం

18 Feb, 2022 18:32 IST|Sakshi

బీజేపీపై, ఆ పార్టీ కీలక నేతలపైనా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో చేశారు. ఈ కార్యక్రమాల వేదికగా ఆయన బీజేపీ నేతలపైనా ఆగ్రహం వెల్లగక్కారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బీజేపీని బొంద పెడదాం అంటూ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారాయన.

తెలంగాణ వస్తే కరెంట్‌, నీళ్లు ఉండవని అన్నారు. పాలన చేతనైతుందా? అని సమైక్యవాదులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది. అలాంటిది తెలంగాణపై ఎందుకు అంత అక్కసు అంటూ బీజేపీని నిలదీశారు మంత్రి కేటీఆర్‌. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని, వారికి వ్యక్తిగతంగానే సమాధానం చెప్పాలని కేటీఆర్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రేవంత్‌ రెడ్డి చంద్రబాబు బంటు అని తెలుసు. బండి సంజయ్‌ ఎవరి బంటో తెలియదు. కిషన్‌రెడ్డి ఏం నాయకుడో అర్థం కాదు. కేసీఆర్‌ను ఏమైనా అంటే చుక్కలు చూపిద్దాం. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొడదాం అంటూ కార్యకర్తల్లో జోష్‌ నింపాడాయన. 

రాజ్యసభలో రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలను చేసిన మోదీని తెలంగాణ సమాజం క్షమించదని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీజేపీని బట్టలిప్పి నగ్నంగా కొడదామని మంత్రి కేటీఆర్ అన్నారు. మిషన్‌ భగీరథకు, మిషన్‌ కాకతీయకు వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసింది. కానీ, మోదీ కనీసం చిల్లర పైసలు కూడా ఇవ్వలేదు. పైగా మిషన్‌ భగీరథను కాపీ కొట్టి.. హర్‌, ఘర్‌, జల్‌ అంటూ డ్రామాలాడుతున్నారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌, వన్‌ రేషన్‌, వన్‌ రిజిస్ట్రేషన్‌ అంటారు. కానీ, దేశంలో జరిగిన ఒకే ఒక తప్పు.. 2014లో మోదీని నమ్మి గెలిపించడమే. నమో అంటే.. నమో నమ్మించి మోసం చేసేవాడు. నరేంద్ర మోదీ కాదు. నమోని నమ్మి ఎనిమిదేళ్లు మోసపోయాం. జీవితాలు మార్చమంటే.. జీవిత బీమా సంస్థకు కూడా అమ్మేస్తున్నారు అంటూ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేటీఆర్‌. బీహార్‌లో ఓ వ్య‌క్తి అకౌంట్లో రూ. 10 ల‌క్ష‌లు జ‌మ అయ్యాయి. మోదీ పంపిండు అని ఆ పైస‌ల‌తో ఇల్లు క‌ట్టుకుండు. మోదీ పంపలేదు. అదంతా అబ‌ద్దం.. పైస‌లు క‌ట్టు అని బ్యాంకు అధికారి నిల‌దీస్తే ఆ వ్య‌క్తి దీక్ష చేసిండు. జ‌న్ ధ‌న్ ఖాతాలో రూ. 15 ల‌క్ష‌లు వేస్తాన‌ని మోదీ మాట మరిచారు. 2 కోట్ల ఉద్యోగాలు ప్ర‌తి సంవ‌త్స‌రం ఇస్తాన‌ని చెప్పి మోసం చేశారు. ఉద్యోగాల గురించి మీడియా ప్ర‌శ్నిస్తే.. మోదీ తెలివిగా స‌మాధానం చెప్పాడు. మీ సిరిసిల్ల హాస్పిట‌ల్ ముంద‌ట ప‌కోడి వేసుకోవ‌డం ఉద్యోగం క‌దా? అని మోదీ అంటున్నాడ‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. 

మేడారం జాతరకు అంతేనా?

మేడారం జాత‌ర‌ను మినీ కుంభ‌మేళా అని అంటారు కిషన్‌ రెడ్డి. ఐదారు రాష్ట్రాల నుంచి ల‌క్ష‌ల మంది భ‌క్తులు వ‌స్తుంటారు. అట్లాంటి జాత‌ర‌కు కేంద్రం ఇచ్చేది రూ. రెండున్న‌ర కోట్లు మాత్ర‌మేనా?. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన కుంభ‌మేళాకు రూ. 375 కోట్లు ఇచ్చారు. మ‌న‌కేమో ముష్టి వేసిన‌ట్టు రూ. రెండున్న‌ర కోట్లు ఇచ్చారు. దీనికే కిష‌న్ రెడ్డి సిగ్గులేకుండా.. ఇది మినీ కుంభ‌మేళా అంటారు.. కానీ నిధులు మాత్రం తీసుకురారు. క‌రీంన‌గ‌ర్‌కు ఒక ట్రిపుల్ ఐటీ కావాల‌ని అడిగితే ఇవ్వ‌లేదు. ఈ ఎనిమిదేండ్ల‌లో తెలంగాణ‌కు ఎన్ని విద్యాసంస్థ‌లు ఇచ్చారు? అని కిష‌న్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.

కేసీఆర్‌లాగా గర్జించాలి..
గ‌ల్లీ టు ఢిల్లీ మ‌న‌మే ఉన్నాం. అవులాగాడు, బేకూఫ్‌గాడు మాట్లాడితే బెద‌రొద్దు. ఏ నాయ‌కుడు చేయ‌ని ప‌ని కేసీఆర్ చేసి తెలంగాణ‌ను అభివృద్ధి చేశారు. కేసీఆర్‌ను ఎవ‌రైనా ఒక మాట అంటే ఊరుకునేది లేదు. జ‌న‌గామ‌, ఆర్మూర్‌లో బీజేపీ నాయ‌కుల‌ను పొట్టుపొట్టు త‌న్నారు. హ‌ద్దులు దాటితే త‌ప్ప‌కుండా బుద్ధి చెప్తాం అని బీజేపీ నేత‌ల‌ను ఉద్దేశించి కేటీఆర్ హెచ్చ‌రించారు. సిరిసిల్ల గ‌డ్డ మీద చైత‌న్యం చూపిస్తాం. ఇక నుంచి ఊకోం అని తేల్చిచెప్పారు. కేసీఆర్ తెలంగాణ‌కు ఏం త‌క్కువ చేసిండు అని బీజేపీ నాయ‌కుల‌ను నిల‌దీయాల‌ని మంత్రి కేటీఆర్, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

బీజేపీ అంటే.. 
బీజేపీ అంటే బ‌క్వాస్ ఝూఠా పార్టీ.. లొల్లి ఎక్కువ, చేసేది త‌క్కువ‌. అందుకే ఈ కొత్త పేరు పెట్టాం. బీజేపీ బ‌ట్ట‌లిప్పి న‌గ్నంగా నిల‌బెట్టాలి. చండాల‌మైన బీజేపీ ప‌ద్ధ‌తుల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. పనిలో పనిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పైనా కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. దమ్ముంటే మోదీ దగ్గరకు వెళ్లి.. వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకురావాలని సవాల్‌ విసిరారు. 

బండి సంజ‌య్ ఎంపీగా గెలిచి మూడేళ్లు అవుతోంది. ఈ కాలంలో మూడు పైస‌లు కూడా తేలేదు. వేములవాడకు పైసా తీసుకురాని బండి సంజయ్ నువ్వు ఎంపీగా ఎందుకున్నావ్? మీ మోదీ పెద్ద పోటుగాడు క‌దా.. వేముల‌వాడ రాజ‌న్న‌కు పైస‌లు తీసుకురా. అయోధ్య‌కు ఇచ్చిన‌ప్పుడు ఇక్క‌డ ఎందుకు ఇవ్వ‌రు. సిరిసిల్ల నేత‌న్న‌ల‌కు ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేదు. పాల‌మూరు, కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌రు. క‌ర్ణాట‌క‌లోని అప్ప‌ర్ భ‌ద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్త‌రు. మ‌నం అరిచినా, గీ పెట్టినా కూడా మ‌న‌కు జాతీయ హోదా ఇవ్వ‌రు. మోదీ కేవ‌లం ఉత్త‌ర భార‌తానికే ప్ర‌ధాన మంత్రా? తెలంగాణ ప్ర‌జ‌ల మీద ఎందుకింత వివ‌క్ష‌? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. తెలంగాణ‌కు సాయం చేయ‌కుండా అడ్డ‌గోలు మాటలు మాట్లాడుతారు అని బీజేపీ నాయ‌కుల‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు.

మరిన్ని వార్తలు