‘మోదీ సర్కార్‌కు సరుకు లేదు, ప్రజల సమస్యలపై సోయి లేదు: కేటీఆర్‌

22 Oct, 2022 16:56 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌:  పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం విధించిన సెస్సు తీసేయాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం దోచుకున్నది చాలని.. వీటి ధరలు పెంచి ఇప్పటికే 30 లక్షల కోట్లను మోదీ సర్కార్‌ దోచుకుందని ధ్వజమెత్తారు. లీటరు పెట్రోల్‌ రూ.70 డీజిల్‌ రూ.65కే ఇవ్వాలనేది తమ డిమాండ్‌గా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో లారీ యాజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మోదీ సర్కార్‌కు సరుకు లేదు, ప్రజల సమస్యలపై సోయి లేదని మండిపడ్డారు. కేంద్రాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహీ అనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ పెద్దలకు కేంద్రం రూ.11.5 లక్షల కోట్లు మాఫీ చేసిందని గుర్తు చేశారు. సామాన్యులకు ఉచితాలు ఇవ్వకూడదని కేంద్రం చెబుతోందని అన్నారు. పెద్దలకు మాఫీ చేయొచ్చు కానీ పేదలకు చేయకూడదా అని ప్రశ్నించారు. 

‘దేశంలో 24 గంటలు కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఫ్లోరైడ్‌ సమస్యను రూపుమాపిన ఘనత కేసీఆర్‌ది. ప్రపంచ నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతుంది. మిషన్‌ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నాం. నేడు మూడున్నర కోట్ల టున్నల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. 8 ఏళ్లుగా ఒకే మాట మీద అందరం నడుస్తున్నాం. కుల, మత తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతుంది. నూకలు తినండని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది. తెలంగాణను అవమానించిన బీజేపీ నేతల తోకలు కత్తిరించాలి’ అని కేంద్రంపై మండిపడ్డారు.
చదవండి: కళ్ల జోడు లేకుండా చదవలేకపోతున్నా: కేటీఆర్‌

మరిన్ని వార్తలు