రైతు పక్షపాతి సీఎం జగన్‌

16 Nov, 2020 03:54 IST|Sakshi

చంద్రబాబు హయాంలో సున్నా వడ్డీ రాయితీ బకాయి రూ.1,200 కోట్లు

రైతుల ఖాతాల్లో రేపు జమ చేయనున్న ముఖ్యమంత్రి జగన్‌

వీటితో పాటు 2019 వడ్డీ రాయితీ రూ.510.30 కోట్లు అందజేత

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడి

కాకినాడ రూరల్‌: కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ అన్నదాతలకు మేలు చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతిగా నిలుస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఎంపీ వంగా గీతతో కలిసి ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. రైతులకు చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీకి పంట రుణాలిస్తామని మోసం చేసిందని, 2014 నుంచి 2019 వరకూ రైతులకు రూ.1,865 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.685 కోట్లు మాత్రమే చెల్లించి, మిగిలింది ఎగ్గొట్టారని గుర్తు చేశారు. నాటి బకాయిలు రూ.1,200 కోట్లు తీరుస్తానని వైఎస్‌ జగన్‌ రైతులకు మాట ఇచ్చారని.. ఆ మొత్తాలను  ముఖ్యమంత్రి నేరుగా రైతుల ఖాతాల్లో మంగళవారం జమ చేస్తారన్నారు. సీఎం మాట ప్రకారం గత ఖరీఫ్‌లో పంట రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీ కూడా ఇప్పుడు చెల్లిస్తున్నామని చెప్పారు. సీజన్‌ పూర్తయిన వెంటనే ఇలా ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. మొత్తం క్లెయిమ్‌ల ప్రకారం 48.60 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ రాయితీ కింద రూ.510.30 కోట్లు ఇవ్వనున్నామని, ఇప్పటివరకూ 10,62,335 మంది రైతుల క్లెయిములకు సంబంధించి రూ.205.74 కోట్లు మంగళవారం ఇవ్వనున్నామని తెలిపారు.

విపత్తుల్లో నష్టపోయిన రైతులకూ..
జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ అధిక వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో 93,908 హెకాంటర్లలో పంటలు దెబ్బతిని, 1,70,266 మంది రైతులు నష్టపోయినట్టు అంచనా వేశామని మంత్రి చెప్పారు. ఏ సీజన్‌కు ఆ సీజన్‌లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారని, ఈ దృష్ట్యా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ జరిగిన పంట నష్టానికి రూ.136.14 కోట్లను ఇప్పటికే రైతుల అకౌంట్లలో వేశామని తెలిపారు. అక్టోబర్‌లో చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో 1.67 లక్షల మంది రైతులకు చెందిన 77 వేల హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాలు వంటి పంటలు దెబ్బతిన్నాయని, వారికి రూ.109 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వబోతున్నామని చెప్పారు. దీంతోపాటు 31 వేల మంది రైతులకు చెందిన 14 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, వారికి రూ.23.64 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. మొత్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టపరిహారంగా దాదాపు రూ.133 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని మంగళవారం చెల్లించనున్నారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించామని చెప్పారు. 

మరిన్ని వార్తలు