నోరు అదుపులో పెట్టుకోకుంటే చూస్తూ ఊరుకోం
7వ తరగతి కూడా పాస్ కాని నీకు స్టాన్ఫర్డ్ సర్టిఫికెట్ ఎలా వచ్చిందో అందరికీ తెలుసు
తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి
Lakshmi Parvathi Slams Nara Lokesh:
సాక్షి,అమరావతి: లోకేశ్.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాట తీస్తాం.. అంటూ తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి హెచ్చరించారు. సీఎం జగన్పై లోకేశ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, టీడీపీకి భవిష్యత్తు లేదన్న భయాందోళనలే ఆయనతో ఇలా మాట్లాడిస్తున్నాయన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. లోకేశ్ భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చిన్న సైగ చేస్తే.. లోకేశ్ను ఏం చేసేందుకైనా మేం సిద్ధం అంటూ హెచ్చరించారు.
ఏడో తరగతి కూడా పాస్కాని వ్యక్తికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ ఎలా వచ్చిందో అందరికీ తెలుసన్నారు. ఏదైనా కొంతకాలమే సహిస్తామని, ఎక్కువైతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకుంటే.. ఆపై జరిగే అనర్థాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేశ్లు మేనేజ్ చేసుకుని కేసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారంటూ ధ్వజమెత్తారు. లక్ష కోట్లు దోచిన చంద్రబాబు, లోకేశ్లు ధన బలంతో మదమెక్కి మాట్లాడుతున్నారని, వీరు ఎన్ని చేసినా టీడీపీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. అద్భుత పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ను ప్రజలంతా కీర్తిస్తున్నారన్నారు.