ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు

26 Sep, 2022 12:56 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్‌ను చంపిన దుర్మార్గులకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్‌ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పేరు మార్పుపై ఎప్పుడూ కూడా ఆలోచించని వారు ఇప్పుడు రాద్దాంతం చేస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, రాధాకృష్ణ ఓ వీడియోలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు తీసేయాలని మాట్లాడుకోలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మారిస్తే మాత్రం వీళ్లు మరోలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

‘ఎన్టీఆర్‌ పేరు.. హెల్త్ యూనివర్సిటీకి కావాలా? జిల్లాకి కావాలా? అంటే నేను జిల్లాకే పేరు ఉండాలని అంటాను. వర్శిటీ కంటే జిల్లా చాలా పెద్దది. జిల్లాకు పేరు పెట్టడంలోనే వైఎస్‌ జగన్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తోంది. ద్వేషంతోనో, పగతోనో వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్చలేదు. రూపాయి వైద్యుడిగా వైఎస్సార్ పేరు పెట్టే విషయంలో సీఎం జగన్ చెప్పిన విషయం సబబుగా ఉంది. మరో గొప్ప ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టేలా నేను సీఎం వద్దకు వెళ్తాను. ఇక్కడ ఎన్టీఆర్‌ను అగౌరవపరిచింది ఏముంది? యూనివర్సిటీ ఉన్న జిల్లా పేరే ఎన్టీఆర్ ఉంది. సీఎం జగన్ ఎన్టీఆర్‌పై గౌరవం ఉందని అసెంబ్లీ వేదికగా స్పష్టంగా చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వొద్దని వాజ్‌పేయికి చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు’అని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 చదవండి: (ఆ మర్డర్‌ వెనుక నువ్వు, రామోజీ లేరా?: లక్ష్మీపార్వతి)

మరిన్ని వార్తలు