Pinarayi Vijayan: పినరయి దిగ్విజయన్‌

3 May, 2021 03:52 IST|Sakshi

 వరుసగా రెండోసారి అధికారంలోకి ఎల్డీఎఫ్‌

40 ఏళ్ల ఆనవాయితీని తిరగరాసిన పినరయి

తిరువనంతపురం: పినరయి విజయన్‌ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్‌ కేరళలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకు గాను, 99 సీట్లను ఎల్డీఎఫ్‌ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష యూడీఎఫ్‌ 41 స్థానాల్లో గెలుపొందింది. సీఎం పినరయి విజయన్, ఆయన కేబినెట్‌ సహచరులు కేకే శైలజ, ఎంఎం మణి, ఏసీ మొయిదీన్, సురేంద్రన్, రామచంద్రన్, క్రిష్ణ కుట్టీ, టీపీ రామకృష్ణన్, చంద్రశేఖరన్‌ తదితరులు గెలుపొందారు.

ఇటీవల రాజీనామా చేసిన ఉన్నత విద్యా శాఖ మాజీ మంత్రి కేటీ జలీల్‌ కూడా తవనూర్‌ నుంచి గెలిచారు. అయితే ఫిషరీస్‌ మంత్రి మెర్సీకుట్టీ అమ్మ కాంగ్రెస్‌ అభ్యర్థి పీసీ విష్ణునాథ్‌ చేతిలో ఓడిపోయారు. ప్రతిపక్ష నేతలు రమేశ్‌ చెన్నితల, మాజీ సీఎం ఊమెన్‌ చాందీ గెలుపొందారు. తన సమీప అభ్యర్థి అధికార సీపీఎం తరఫున పోటీ చేసిన సీ థామస్‌పై 9,044 ఓట్ల తేడాతో గెలుపొందారు.  


ఎన్ని ఆరోపణలు వచ్చినా..
ఎల్డీఎఫ్‌ రెండోసారి అధికారంలోకి అంత సులువుగా ఏమీ రాలేదు. కేరళ నుంచి వామపక్షాలను తుడిచిపెడతామని యూడీఎఫ్, బీజేపీలు ప్రచారం సందర్భంగా చాలాసార్లు ఉద్ఘాటించాయి. ప్రభుత్వంపై వచ్చిన ఎన్నో ఆరోపణలు, మనీ లాండరింగ్‌ కేసులో పార్టీ మాజీ సెక్రటరీ బాలకృష్ణన్‌ కుమారుడిని అరెస్టు చేశారు. ప్రభుత్వంపై కాస్త అసంతృప్తి తదితర సమస్యలను దాటుకుంటూ సీఎం పీఠం దక్కించుకుంది.

గతేడాది సంచలనం రేపిన బంగారం స్మగ్లింగ్‌ కేసులో సీఎం కార్యాలయం ప్రమేయం ఉందని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం పినరయి విజయన్‌కు తెలిసే జరిగిందంటూ కాంగ్రెస్‌ తీవ్రంగా ఎండగట్టింది. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌ అధికారి ఒకరు 1.9 లక్షల డాలర్లు (రూ.1.2 కోట్లు) ఒమన్‌లోని మస్కట్‌కు స్మగ్లింగ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి.

విజయన్‌కు చాలా దగ్గరి వ్యక్తి, మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.శివశంకర్‌పై ఉన్న రెండు కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతోంది. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను.. మోదీ ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలు తమపై దాడి చేస్తున్నాయంటూ ప్రచారం చేస్తూ.. సానుభూతి పొందుతూ దే ప్రయత్నం చేసింది. మూడేళ్ల కింద శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళను అనుమతించే వివాదంతో కేరళ ప్రభుత్వం ఒకానొక సందర్భంలో తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ వివాదం అధికారపార్టీపై తీవ్ర ప్రభావమే చూపింది. దీంతో తిరిగి అధికారంలోకి వస్తామా అని ఎల్డీఎఫ్‌ వర్గాలే అనుమానం వ్యక్తం చేశాయి. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తరహా విజయం వరిస్తుందని ఆశలు చిగురించాయి.  

ఉన్న ఒక్కసీటూ కోల్పోయిన బీజేపీ
కేరళలో బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. గతంలో ఉన్న సిట్టింగ్‌ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది. బీజేపీ తరఫున పోటీ చేసిన ఆ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ‘మెట్రోమ్యాన్‌’ఇ.శ్రీధరన్‌ కూడా గెలవలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో గెలుపొందగా, ఇప్పుడు ఆ సిట్టింగ్‌ స్థానాన్ని కూడా కోల్పోయింది. మిజోరం మాజీ గవర్నర్‌ కుమ్మనం రాజశేఖరన్‌ను బరిలో దింపగా, సీపీఎం అభ్యర్థి వి.శివకుట్టి చేతిలో పరాజయం చెందారు. మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ కొన్ని రౌండ్ల వరకు ఆధిక్యం కనబర్చినా.. చివరి క్షణంలో సీపీఎం అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే షఫీ పారాంబిల్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ప్రకటించని బీజేపీ.. శ్రీధరన్‌ను తమ పార్టీ సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం చేసింది.

అయినా బీజేపీ వ్యూహం కేరళలో ఫలించలేదు. సినీ నటుడు, రాజ్యసభ ఎంపీ సురేశ్‌ గోపీ బీజేపీ తరఫున బరిలో దిగారు. ఓట్ల లెక్కింపులో సురేశ్‌ ఆధిక్యం కనబర్చినా.. చివరి రౌండ్లతో ఫలితం తారుమారైంది. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి కేజే అల్ఫోన్స్‌ కూడా కంజిరపల్లి స్థానం నుంచి ఓడిపోయారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్‌ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. లవ్‌ జిహాద్, శబరిమల ఆలయంలోని మహిళల ప్రవేశం వంటి అంశాలను బీజేపీ తన అస్త్రాలుగా మార్చుకుని తీవ్రంగా ప్రచారం చేసింది. ఎల్డీఎఫ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని కొనసాగించింది. అయినా కేరళలో బీజేపీ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు తాజా ఫలితాల ద్వారా స్పష్టం అవుతోంది.  


సరైన రాష్ట్రస్థాయి నాయకుడు లేకనే..
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. బంగారం స్మగ్లింగ్‌ కేసులో సీఎం విజయన్‌ పాత్ర వంటి అంశాలను యూడీఎఫ్‌ కూటమి ఓటర్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కాకపోతే పినరయి విజయన్‌ వంటి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నాయకుడితో దీటుగా ఎదుర్కోగల నేత లేకపోవడం కూడా యూడీఎఫ్‌ వెనుకంజకు ముఖ్య కారణమని విశ్లేషిస్తున్నారు. మాజీ సీఎం ఊమెన్‌ చాందీ ఎన్నికల ర్యాలీలో.. ఓ మత సంస్థలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనం రేపాయి. చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఈ వ్యాఖ్యలు కూడా యూడీఎఫ్‌ కూటమికి నష్టం చేకూర్చాయనే చెప్పొచ్చు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు చెక్‌ పెట్టగల సత్తా తమకే ఉందని యూడీఎఫ్‌ భావించింది. అయితే ఫలితాలు అందుకు భిన్నంగా ఉండటంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఎదురు దెబ్బ అని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు