ప్రతిపక్ష నేత ఎంపికపై సందిగ్ధం..!  నాన్చుతున్న కాంగ్రెస్‌

23 Nov, 2022 08:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను వచ్చే నెల 7వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచి్చనప్పటికీ..రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఎవరన్న దానిపై ఇంకా కాంగ్రెస్‌ అధిష్టానం ఎటూ తేల్చలేదు. తదుపరి ప్రతిపక్ష నేత ఎంపికపై ఇంతవరకూ కాంగ్రెస్‌ ఎలాంటి చర్చలు జరుపకపోవడంతో ఉత్కంఠ మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలున్నాయి.

కనీసం సమావేశాల నాటికైనా కాంగ్రెస్‌ నిర్ణయం చేస్తుందా? లేక ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేనే ప్రతిపక్ష„ నేతగా కొనసాగిస్తుందా? అన్నది కొంత ఆసక్తిగా మారింది. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’అన్న కాంగ్రెస్‌ నిబంధన మేరకు ఏఐసీసీ అధ్యక్షుడిగా నామినేషన్‌ వేసిన రోజునే ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తూ తన లేఖను అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాం«దీకి పంపారు.

అనంతరం కొత్త నేతను కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌ పర్సన్‌ హోదాలో సోనియాగాంధీ ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ అది జరుగలేదు. ప్రధానంగా పార్టీ సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్, జైరాం రమేశ్‌లలో ఒకరిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా దక్షిణాదికి చెందిన ఖర్గే ఉన్నందున ఉత్తరాదికి చెందిన దిగ్విజయ్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని చర్చ జరిగింది. వీరితో పాటే సీనియర్‌ నేతలు పి.చిదంబరం, ముకుల్‌ వాస్నిక్, ప్రమోద్‌ తివారీలపేర్లు చర్చల్లోకి వచ్చాయి.

అయితే శీతాకాల సమావేశాల సమయంలోనూ భారత్‌ జోడో యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో జైరా, దిగి్వజయ్‌ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరూ సభకు హాజరయ్యే అవకాశాలు తక్కువని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. ఈ నేపథ్యంలో ఖర్గేను శీతాకాల సమావేశాల వరకు ప్రతిపక్ష నేతగా కొనసాగిస్తారంటున్నారు. దీనిపై ఏఐసీసీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ ‘సమావేశాలకు కొద్ది రోజుల ముందు ప్రతిపక్ష నేత ఎంపికపై నిర్ణయం చేస్తారు’అని వ్యాఖ్యానించారు.
చదవండి: ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్

మరిన్ని వార్తలు