మండలి చైర్మన్‌ పదవికి మోషేన్‌ రాజు నామినేషన్‌ 

19 Nov, 2021 03:20 IST|Sakshi

సాక్షి, అమరావతి/భీమవరం: శాసనమండలి చైర్మన్‌ పదవి తొలిసారి ఎస్సీలకు దక్కనుంది. ఈ పదవికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌ రాజును ఎంపిక చేశారు. తొలి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎస్సీ వర్గానికి చెందిన కె.నారాయణస్వామిని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే అదే వర్గానికి చెందిన మేకతోటి సుచరితను హోంశాఖ మంత్రిగా నియమించారు. రాష్ట్ర చరిత్రలో ఎస్సీ మహిళను హోం మంత్రిని చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.  

నేడు ఎన్నిక 
శాసనమండలి చైర్మన్‌ ఎన్నిక శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనుంది. ఎమ్మెల్సీగా ఎంఏ షరీఫ్‌ పదవీకాలం ముగియడంతో మండలి చైర్మన్‌ పదవి ఖాళీ అయ్యింది. దీంతో మండలి చైర్మన్‌ ఎన్నికకు గురువారం కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. చైర్మన్‌ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కొయ్యే మోషేన్‌రాజు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ ఒక్కటే దాఖలైన నేపథ్యంలో ఆయన మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.  

కొయ్యే మోషేన్‌ రాజు ప్రస్థానమిది.. 
జననం: 1965, ఏప్రిల్‌ 10 
తల్లిదండ్రులు: కొయ్యే సుందరరావు, మరియమ్మ 
స్వగ్రామం: పశ్చిమ గోదావరి జిల్లా 
భీమవరంలోని గునుపూడి 
విద్యాభ్యాసం: డిగ్రీ 

గతంలో చేపట్టిన పదవులు 
► 1987 నుంచి వరుసగా నాలుగుసార్లు మునిసిపల్‌ కౌన్సిలర్‌గా, రెండుసార్లు ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు.  
► ఏపీసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా, కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా, యూత్‌ కాంగ్రెస్‌ భీమవరం పట్టణ అ«ధ్యక్షుడిగా వివిధ పదవులు నిర్వహించారు. 
► కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  8 పార్టీకి మోషేన్‌ రాజు సేవలను గుర్తించిన సీఎం జగన్‌ గవర్నర్‌ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేశారు.  

వైఎస్సార్‌సీపీలో కష్టపడ్డవాళ్లకు గుర్తింపు, గౌరవం 
వైఎస్సార్‌సీపీలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం ఉంటుందనడానికి నన్ను మండలి చైర్మన్‌గా ఎంపిక చేయడమే నిదర్శనం. వైఎస్సార్‌ కుటుంబాన్ని, సీఎం వైఎస్‌ జగన్‌ను నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందనడానికి ఇదే తార్కాణం. సీఎం జగన్‌ ఎస్సీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. సామాజిక న్యాయాన్ని చాటి చెబుతున్నారు.      
 – కొయ్యే మోషేన్‌ రాజు  

చదవండి: టీడీపీని ఎన్టీఆర్‌ కుటుంబానికి అప్పగించు బాబూ!

మరిన్ని వార్తలు