నితీష్‌కు చెక్ ‌పెట్టేందుకు బీజేపీ వ్యూహం..!

6 Oct, 2020 14:20 IST|Sakshi

పట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో రాజకీయం వేడెక్కింది. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై అధికార పక్షంతో పాటు విపక్ష పార్టీలు సైతం కసరత్తు ప్రారంభించాయి. బీజేపీ-జేడీయూ కూటమి మధ్య సీట్ల పంపకం ఇప్పటికే ఓ కొలిక్కి రాగా.. కాంగ్రెస్‌, ఆర్జేడీ, వామపక్షాల కూటమి తరఫున సీఎం అభ్యర్థిగి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజీస్వీ యాదవ్‌ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరుకు కూటమిలో సీట్లు సర్థుబాటు కూడా పూర్తయ్యింది. మొత్తం 243 స్థానాల్లో ఆర్జేడీ 144, కాంగ్రెస్‌70, సీపీఐఎంఎల్‌ 19, సీపీఎం 4 చోట్ల పోటీచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు  జేడీయూ 122 సీట్లలో, బీజేపీ 121 సీట్లలో పోటీ చేయనున్నాయి. (వీడిన చిక్కుముడి.. కుదిరిన ఒప్పందం)

బీజేపీ ప్రయోగించిన అస్త్రంగా ఎల్‌జేపీ
ఇదిలావుండగా కేంద్రమంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తిపార్టీ (ఎల్‌జేపీ) నితీష్‌ కుమార్‌ సారథ్యంలోని జేడీయూకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతున్న ప్రకటించింది. ఈ మేరకు ఎన్డీయే నుంచి తాము బయటకు వస్తున్నట్లు పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ ప్రకటించడం బిహార్‌ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అయితే తాము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని పార్టీ నాయకత్వానికి విధేయులుగానే కొనసాగుతామని పాశ్వాన్‌ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. బిహార్‌లో సొంతంగా బరిలోకి దిగుతామని ప్రకటించిన ఎల్‌జేపీ నాయకత్వం తమ పోటీ జేడీయూపైనే అనే స్పష్టం చేసింది. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థుల విజయానికి కృష్టి చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన జాతీయ రాజకీయాల్లోనూ కొత్త చర్చకు దారితీసింది. బిహార్‌లో నితీష్‌కు చెక్‌ పెట్టేందుకు బీజేపీ ప్రయోగించిన అస్త్రంగా ఎల్‌జేపీని విశ్లేషిస్తున్నారు. (ఎన్నికల నగారా మోగింది.. ఇక సమరమే)

జేడీయూపై ఎల్‌జేపీ పోటీ..
పాశ్వాన్‌ నిర్ణయం వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని, ఈ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులను ఓడించి అసెంబ్లీ అతిపెద్ద పార్టీగా అవతరించి సీఎ పీఠాన్ని అదిష్టించాలన్నదే కమళనాథుల వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిహార్‌లో ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన పాశ్వాన్‌ బీజేపీ నాయకత్వానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ప్రకటించడం వెనుక ఏదో తెలియని రహస్యం దాగి ఉన్నదని వారి అభిప్రాయం. దీనిలో భాగంగానే ఎల్‌జేపీ అభ్యర్థులను జేడీయూపై పోటీకి నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం.

మరీ ముఖ్యంగా ఎల్‌జేపీ నేతలు నితీష్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శల దాడికి దిగుతున్నారు. జేడీయే అభ్యర్థుల ఓటమే తమ లక్ష్యమని ఇదివరకే ప్రకటించారు. దీంతో బీజేపీ కావాలనే ఎల్‌జేపీని తమపై పోటీకి దింపుతోందని పలువురు జేడీయూ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇక ఈ ఎత్తులను నితీష్‌ ఏ విధంగా ఎదుర్కొంటారనేది బిహార్‌ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది. బిహార్‌ అసెంబ్లీకి అక్టోబర్‌ 28న తొలి విడత పోలింగ్‌ జరుగనుంది. నవంబర్‌ 3న రెండో విడత, నవంబర్‌ 7న మూడో విడత పోలింగ్‌ అనంతరం నవంబర్‌ 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.

మరిన్ని వార్తలు