‘దొంగ.. నీ మామ, నియంత, గూండా’ పదాలు నిషేధిస్తూ పుస్తకం

9 Aug, 2021 12:21 IST|Sakshi
పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి చౌహన్‌, స్పీకర్‌, ఇతర నాయకులు (ఫొటో: IndiaToday)

38 పేజీల అన్‌పార్లమెంటరీ భాషపై ఓ పుస్తకం

మామ, దొంగ, వ్యభిచారి పదాలు నిషేధం

పుస్తకాన్ని విడుదల చేసిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ

భోపాల్‌: వాస్తవంగా నాలుగు నెలలకోసారి చట్టసభల సమావేశాలు జరగాలి. కానీ ప్రభుత్వాలు రాజకీయాలతో చట్టసభల ప్రాధాన్యం తగ్గిస్తున్నాయి. ఒకవేళ సమావేశాలు నిర్వహిస్తే అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కైనట్టు ఒక్కనాడు కూడా సక్రమంగా జరగవు. ఈ సమావేశాల్లో వాగ్వాదాలు ఏర్పడి ఒక్కోసారి తీవ్రస్థాయిలో వాదనలు ఉంటాయి. ఈ సమయంలో పచ్చిబూతులు కూడా వస్తుంటాయి. స్పీకర్‌ వాటిని వినలేకపోతుంటారు. తూక్కెత్తా అంటే తూక్కెత్తా అంటూ మాటల దుమారం ఏర్పడుతుంది. ఇలా సభలో అన్‌పార్లమెంటరీ భాష వినియోగం అధికమవుతుండడంతో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సభలో కొందరు సభ్యులు పలికిన పదాలను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఆ విధంగా నిషేధించిన పదాల వివరాలతో ఓ పుస్తకం విడుదల చేసింది.

ఈ క్రమంలో కొన్ని పదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో పప్పూ అనే పదం కూడా నిషేధం ఉండడం గమనార్హం. ఈ పదంతో తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ఒకరు గుర్తుకు వస్తుంటారు. తమ నేతను ఆ పదంతో సంబోధిస్తున్నారనే ఉద్దేశంతో ఈ పదాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. మొత్తం 38 పేజీలతో కూడిన ఈ పుస్తకంలో 1,161 పదాలు నిషేధంలో ఉన్నాయి. దొంగ, చెడిన, అవినీతిపరుడు, నియంత, గూండా, వ్యభిచారి, అబద్ధాలకోరు, మామ తదితర పదాలు నిషేధం. 

ఈ పుస్తకాన్ని ఆదివారం ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ విడుదల చేశారు. సోమవారం నుంచి ఈ పుస్తకాలను అసెంబ్లీ సభ్యులకు పంపిణీ చేయనున్నారు. ప్రారంభమైన వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభ్యులు సంయమనంతో సభలో పాల్గొనేలా ఆ పుస్తకం మార్పు తెస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత విలువలతో విలువైన సభా సమయాన్ని వృథా చేయొద్దని సీఎం పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు