దళిత ద్రోహి చంద్రబాబు

4 Aug, 2020 04:39 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్‌ నేతలు

పేదలకు ఇచ్చే స్థలాలపై కోర్టుకు వెళ్లడం దారుణం

రాజధాని అమరావతి ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు నాగయ్య

తాడేపల్లి రూరల్‌: చంద్రబాబు దళిత, పేద ప్రజల ద్రోహి అని మరోసారి స్పష్టమైందని రాజధాని అమరావతి ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మల్లవరపు నాగయ్య ధ్వజమెత్తారు. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాలకు అడ్డుపడొద్దంటూ సోమవారం రాయపూడి నుంచి హైకోర్టు వరకూ భారీ ర్యాలీ తలపెట్టారు. అయితే ముందస్తుగా పోలీసులు ఎమ్మార్పీఎస్‌ నాయకులను అరెస్టు చేసి, గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు.

ఈ సందర్భంగా నాగయ్య మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ దళితులు, పేదలను పూచికపుల్లతో సమానంగా చూశారని మండిపడ్డారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కోర్టులో పిటిషన్‌లు వేయిస్తూ చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎమ్మార్పీఎస్‌ నేతలు జాన్‌బాబుమాదిగ, కట్టెపోగు బాబూరావు, మిట్టా నిర్మలమాదిగ, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు దేవరాజు తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు