‘నాకెందుకు వ్యాక్సిన్‌.. ముందు యువతకు ఇవ్వండి’

1 Mar, 2021 20:50 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ మార్చి 1 (సోమవారం) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం కంటే యువతకు అందిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీరు వ్యాక్సిన్‌ తీసుకుంటారా అని ప్రశ్నించగా.. తాను మరో పది, పదిహేనేళ్లు బతుకుతానని.. ఇప్పుడు వ్యాక్సిన్‌ తనకెందుకని పేర్కొన్నారు. యువతకు జీవిత కాలం ఎక్కువ ఉందని, వారికి ముందుగా టీకా అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. చివరికి తను కూడా వ్యాక్సిన్‌ తీసుకుంటానని బదులిచ్చారు.

అదే విధంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసిన శాస్త్రవేత్తలను ఖర్గే అభినందించారు. అయితే అలాంటి విజయాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించరాదన్నారు. దేశంలో బీజేపీ విభజించు-పాలించు సూత్రాన్ని పాటిస్తోందని, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను కూలగొట్టాలనే ఉద్ధేశ్యంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని దుయ్యబట్టారు. 

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సిన్ తీసుకున్న నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మాటలు పరోక్షంగా మోదీపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సోమవారం కోవిడ్‌ తొలి టీకా తీసుకున్నారు. భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌పై వదంతులు ప్రచారం చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ కొవాగ్జిన్ డోసు తీసుకోవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి: 

కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రధాని మోదీ

ఒక రూపాయి జీతం.. సీఎం‌కు ప్రధాన సలహాదారుగా పీకే‌

విద్యార్థులతో రాహుల్‌ గాంధీ స్టెప్పులు : వైరల్‌

మరిన్ని వార్తలు