కాంగ్రెస్‌కు భారీ షాక్‌: బీజేపీలోకి అధ్యక్షుడు, 8 మంది ఎమ్మెల్యేలు

20 Jul, 2021 09:33 IST|Sakshi

మణిపూర్ కాంగ్రెస్‌లో మరోసారి సంక్షోభం

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీలోకి వలసలు

ఇంపాల్‌: దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీకి తాజాగా మరో రాష్ట్రంలో భారీ షాక్‌ తగిలింది. ఈశాన్య రాష్ట్రల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న కమల పార్టీ ధాటికి కాంగ్రెస్‌ కుదేలవుతుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి భారీ షాక్‌ తగిలింది. మణిపూర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పూడ్చలేని నష్టమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

గోవిందాస్‌ కొంతౌజమ్‌ వరుసగా ఆరు సార్లు బిష్నాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంపీసీసీకి చీఫ్‌ విప్‌గా కూడా పని చేశారు. గతేడాది డిసెంబర్‌లో సోనియా గాంధీ ఆయనను మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. నెల క్రితం వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేసిన గోవిందాస్‌ ఇంత అనూహ్యంగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 
 

మరిన్ని వార్తలు