మేఘాలయలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ కూటమిలోకి..

9 Feb, 2022 16:11 IST|Sakshi

షిల్లాంగ్‌: మేఘాలయలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటి వరకు గిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ మద్దతిస్తున్న అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి (ఎండీఏ)లో చేరారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టు అయింది. అంతకముందు వీరంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని కూటమిలో చేరుతున్నట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మాకు లేఖ అందించారు. కాంగ్రెస్‌ను వీడిన వారిలో ఆపార్టీ శాసనసభాపక్షనేత అంపరీన్‌ లింగ్డోతోపాటు.. మేరల్‌బోర్న్‌ సీయొం, కింఫా ఎస్‌ మార్బనియాంగ్‌, మేహెన్ర్డోరాప్‌సాంగ్‌, పిటీ సాక్మీలు ఉన్నారు.

రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్టీ మేఘాలయ ప్రజాస్వామ కూటమిలో చేరాలని నిర్ణయించినట్టు లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, ఇదే లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా పంపించారు. తాము అధికార కూటమిలో చేరినప్పటికీ కాంగ్రెస్ సభ్యులుగానే కొనసాగుతామని సీఎల్పీ నేత అంపరీన్ లింగ్డో చెప్పడం గమనార్హం. ముఖ్యమత్రితో కలిసి అయిదురు ఎమ్మెల్యే దిగిన ఫోటోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు.
చదవండి: హిజాబ్‌ వివాదంపై కమల్‌ హాసన్‌ కీలక వ్యాఖ్యలు

అయితే తాజా పరిణామంతో ప్రస్తుతం మేఘాలయలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. 60 మంది సభ్యులున్న శాసనసభలో నవంబరు వరకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాతో సహా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. మిగిలిన అయిదుగురు ఇప్పుడు ఎండీఏలో చేరారు. దీంతో మేఘాలయ అసెంబ్లీలో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
చదవండి: మోదీజీ మీ విధానాన్ని మార్చుకోండి!....అప్పుల బాధలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వ్యాపారి!

మరిన్ని వార్తలు