సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని చూసి చంద్రబాబుకు, దుష్టచతుష్టయానికి పిచ్చెక్కిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. పచ్చ మీడియాకు వెర్రెక్కి పిచ్చిరాతలు రాస్తోందన్నారు. తప్పుడు రాతలు, కూతలతో చంద్రబాబును అందలం ఎక్కించేందుకు పచ్చమీడియా రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడం సిగ్గుచేటన్నారు.
ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ దళిత, వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యాపరంగా తలెత్తుకుని జీవించేలా సంక్షేమాన్ని అందిస్తున్నారని తెలిపారు.
రూ.లక్షల కోట్ల సంక్షేమం కనిపించట్లేదా!
‘చంద్రబాబు దళిత హక్కులు, చట్టాలను అపహాస్యం చేసినప్పుడు రామోజీరావుకు కనిపించలేదు. మాకు దక్కాల్సిన నిధులను పందికొక్కుల్లా మేసేసినప్పుడు పట్టలేదు. డ్వాక్రా రుణమాఫీ పేరిట మహిళలను వంచించినప్పుడు మేం గుర్తురాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళితుల్ని అక్కున చేర్చుకుని ఆదరిస్తుంటే మీకు కడుపుమంట ఎందుకు? 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే.. వారిలో మెజార్టీ మా వర్గాలే ఉన్నాయి.
ఇవన్నీ కళ్లుండి చూడలేని వ్యక్తి మీరు. పల్లెల్లో ఎస్సీ, ఎస్టీలను వెళ్లి అడిగితే వాస్తవాలు తెలుస్తాయి’ అని నాగార్జున విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూన్ నుంచి 2022 అక్టోబర్ వరకు ఎస్సీలకు రూ.58,353.07 కోట్లు, ఎస్టీలకు రూ.15,660.03 కోట్ల మేర లబ్ధి జరిగిందని లెక్కలతో సహా వివరించారు. ఈ లబ్ధి చూసైనా అసత్య రాతలు మానుకోవాలని హితవు పలికారు.