ఐటీడీపీ పేరుతో చింతకాయల విజయ్‌ చేసే పని అదా?: మేరుగ నాగార్జున

2 Oct, 2022 12:45 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు తమకు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం వర్తించదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. పచ్చమీడియా వ్యవహారశైలి కూడా అలాగే ఉందన్నారు. చింతకాయల విజయ్‌ సోషల్‌ మీడియా అరాచకవాది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను పెట్టే పోస్టులు ఎంతో దారుణంగా ఉంటాయన్నారు. వాటిపై సీఐడీ విచారణ చేస్తుంటే అదికూడా తప్పు అనేలాగా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు ఎల్లోమీడియా జర్నలిజం చేస్తోందా? అంటూ ప్రశ్నించారు. 

ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'పోలీసులు విజయ్ ఇంటికి వెళ్తే వీరంతా గగ్గోలు పెడుతున్నారు. సీఐడీ వారు దొంగని పట్టుకోవటానికి వెళ్తే తప్పా?. ఒక మహిళ మీద అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని వీరు సమర్ధిస్తారా?. మహిళల మాన, ప్రాణాల గురించి అసభ్యకర పోస్టులు పెట్టాడు. ఐటీడీపీ అనే దాంట్లో ఈ విజయ్ దారుణమైన పోస్టులు పెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ధన, మానాలను దోచుకున్న వ్యక్తులు ఈ టీడీపీ వాళ్లు. అలాంటి వ్యక్తులను ఎల్లోమీడియా ఎందుకు వెనుకేసుకుని వస్తుంది?. వీరి అఘాయిత్యాలపై ప్రతిఘటనగా మావాళ్లు ఎవరైనా పోస్టులు పెడితే తట్టుకోలేకపోతున్నారు. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన ఇతర వ్యాపారాలకు చంద్రబాబు, లోకేష్‌లు సమర్ధిస్తున్నారు. వీరంతా రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారని' మంత్రి ప్రశ్నించారు. 
 
'దేశంలో ఎవరూ చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చిన జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. చింతకాయల విజయ్ కంటే ఎక్కువగా మేము మాట్లాడతాము, తిడతాము. కానీ మాకు సంస్కారం ఉండబట్టి అలా చేయడంలేదు. టీడీపీ వారికి అసలు సిగ్గు అనేది లేదు. చింతకాయల విజయ్ అనే వ్యక్తిపై చట్టం తనపని తాను చేసుకుంటుంది. మహిళలపై సీఐడీ దౌర్జన్యం అంటూ తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదు' అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. 

చదవండి: (వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు)

మరిన్ని వార్తలు