ప్రధాని మోదీపై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు

28 Jul, 2020 14:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ దేశ ప్రధానిగా బాధ్యతలు స్పీకరించారని, ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘింస్తున్నారని మండిపడ్డారు. అయోధ్య రామమందిర భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మోదీ వెళ్లడంపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్‌ 6న ఓ క్రిమినల్స్‌ గుంపు ధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్‌ వేదికగా ఓవైసీ పోస్ట్‌ చేశారు. లౌకికతత్వమనేది రాజ్యాంగంలో ముఖ్యభాగమని దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలని హితవుపలికారు. (అయోధ్యలో ‘కాలనాళిక’)

కాగా ఆగస్ట్‌ 5న అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి షెడ్యూల్‌ ఖరారైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 250 మంది అతిధులు సైతం శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకోనున్నారు. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేను ఆహ్వానించకపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. మందిర నిర్మాణం కోసం ఠాక్రే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు రామాలయ పూజ  సందర్భంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందువులు పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టిని అయోధ్యకు తీసుకువస్తున్నారు. కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా భూమిపూజ నిర్వహిస్తున్నామని,  ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని రామ జన్మభూమి తీర్ధ్‌ క్షేత్ర ట్రస్ట్‌ చైర్మన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు