చంద్రబాబు దొరికిన దొంగ ఇక తప్పించుకోలేరు: మంత్రి అంబటి

25 Sep, 2023 13:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు స్కిల్‌ స్కాంపై చర్చకు రమ్మంటే టీడీపీ సభ్యులు పారిపోయారని విమర్శించారు. అసెంబ్లీలో మీసాలు మెలేసీ, తొడలు కొడుతున్నారని విమర్శించారు. సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసిందని పేర్కొన్నారు. బాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు ఎంత బలంగా ఉందనే విషయం అర్థమవుతోందని తెలిపారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని అన్నారు.

‘రాజకీయాలను డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబు. అన్యాయాలు, అక్రమాలతో చంద్రబాబు రాజ్యాధికారం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారు. ఆయనతోపాటు బాబు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బుసు విపరీతంగా దోచుకున్నారు. దొరికినవి కొన్నే.. దొరకని స్కామ్‌లు చాలానే ఉండొచ్చు. రోజురోజుకు వాస్తవాలు బయటకొస్తున్నాయి. చంద్రబాబు  దొరికిన దొంగ ఇక తప్పించుకోలేరు.

‘రోజు రోజు జరుగుతున్న పరిణామాలు తేటతెల్లంగా అర్థమవుతున్నాయి. అందుకే స్కిల్‌ స్కాంపై చర్చించేందుకు ఆహ్వానించినా.. ఆ దొంగలు (టీడీపీ ఎమ్మెల్యేలు) పారిపోయారు. ఆ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది రాజకీయ కక్ష కాదు. తప్పు చేశారు కాబట్టే ఆయన అరెస్ట్‌ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద వారైనా తప్పు చేస్తే అరెస్ట్‌ కావాల్సిందే. న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సిందే. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అని మంత్రి అంబటి తెలిపారు.
చదవండి: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అప్‌డేట్స్‌

మరిన్ని వార్తలు