దత్తపుత్రుడిని రెండు చోట్లా ఓడించి బాదుడు చూపించారు: అంబటి రాంబాబు

4 May, 2022 19:57 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన శాసనసభకు రావడం లేదంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆనాడు శాసనసభకు రానివారు జీతాలు కూడా తీసుకోకూడదంటూ ప్రగల్భాలు పలికారని గుర్తుచేశారు. ఈ మేరకు మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికంటే ధరలు ఇప్పుడే చౌకగా ఉన్నాయి. ఈ దేశంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఈ మూడేళ్లలో ఏర్పడ్డాయి. దీనివల్ల ధరలు పెరగడం, తగ్గడం జరుగుతూనే ఉన్నాయి.

ఎల్లో మీడియా బాదుడే బాదుడు అని రాతలు రాయడం.. వీళ్లు డ్యాన్సులు చేయడం రివాజుగా మారింది. మీకు 175 సీట్లలో ప్రజలు బాదుడే బాదుడు చూపించారు. నీ కుమారుని మంగళగిరిలో బాదింది అసలు బాదుడు. జన్మభూమి కమిటీల ద్వారా మీరు చేసింది బాదుడే బాదుడు. వైఎస్సార్ 2004, 2009లో చూపించింది బాదుడే బాదుడు.

చదవండి: (అద్దె బస్సుల విధానం ఈనాటిది కాదు: ఆర్టీసీ ఎండీ)

జగన్ వచ్చాక మీకు ఆ బాదుడు మరింత ఎక్కువైంది. 13,081 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే 10,536 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ 81 శాతం గెలుచుకుంది. మొత్తం 637 జడ్పీటీసీల్లో 620 వరకూ గెలుచుకున్నాం. ఎంపీటీసీ 9,583కి 8,249 స్థానాల్లో మేము గెలుచుకున్నాం. 75 నగర పంచాయతీల్లో ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు ఒకటి గెలిచారు. కుప్పంలో 4 మండలాలు, ఒక మున్సిపాలిటీలో ఒకటన్నా గెలిచారా. నీ కుప్పంలోనే తుక్కు తుక్కుగా ఓడించి అసలైన బాదుడు చూపించారు. నీ దత్తపుత్రుడిని రెండు చోట్లా ఓడించి బాదుడు చూపించారు.

దేశవ్యాప్తంగా ధరలు పెరిగితే అది మేమే పెంచినట్లు వీళ్లు ప్రచారం చేస్తారు. నువ్వు ఎంత చించుకున్నా ఇలాంటి కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మరు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అంటూ వీళ్ళు చెప్పే సొల్లు కబుర్లు ఎవరూ పట్టించుకోరు. ముగ్గురూ కలిసి కట్టుగా వచ్చినా రాబోయేది మా ప్రభుత్వమే' అని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 

చదవండి: (రేపల్లె ఘటన బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సురేష్‌, బాలినేని)

మరిన్ని వార్తలు