దమ్ముంటే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలి

15 Sep, 2020 12:44 IST|Sakshi

సాక్షి, అమరావతి : అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల రాష్ట్ర మంత్రులు స్పందించారు. మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి రాసిన లేఖకు తాము సహకరిస్తామని బాబు కేంద్రానికి లేఖ రాయగలరా ? అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ స్వీకరించే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. రాజధానిలో అక్రమాలు జరగకుంటే బాబు ఎందుకు భయపడుతున్నారు? రాజధానిలో అక్రమాలు జరగలేదని చంద్రబాబు సీబీఐకి లేఖ రాయగలరా అంటూ ఎద్దేవా చేశారు. దమ్ముంటే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలని.. ఫైబర్‌ గ్రిడ్‌లో కూడా భారీ అవినీతి జరిగిందన్నారు.(చదవండి : అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు)

కేబినెట్ సబ్ కమిటీ, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా.. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. రాజధాని భూ కుంభకోణంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.  నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనంతగా పంటలు పండాయని..  రైతుల కోసమే ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని..  రైతులను చంద్రబాబు అనవసరంగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంత్రి కన్నబాబు స్పందిస్తూ.. టీడీపీ నేతలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశారని ఆధారాలతో నివేదిక ఇచ్చాం.. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత మాపై ఉంది. కక్షసాధింపే అయితే విచారణ లేకుండానే కేసులు పెట్టేవాళ్లం కదా? అంటూ మండిపడ్డారు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అమరావతిలో ఎక్కడ చూసినా భూ కుంభకోణాలే. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారు.. టీడీపీ నేతలు దళితుల భూములు కూడా దోచుకున్నారు. భూములను టీడీపీ నేతలు, బినామీలే కొనుగోలు చేశారంటూ దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు