విశాఖకు చంద్రబాబు అనుకూలమా?.. కాదా?: మంత్రి అవంతి

30 Aug, 2021 15:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నానికి చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ప్రాంతీయ విభేదాలు వస్తాయని అన్నారు. హైదరాబాద్‌పై పెట్టుబడి పెట్టడం వల్ల విభజనతో ఇప్పుడు నష్టం జరిగిందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగితే విద్వేషాలు ఏర్పడవని వివరించారు. విశాఖకు అన్ని రాజధాని హంగులు ఉన్నాయని తెలిపారు.

అత్యాశగా విశాఖపట్నం రాజధాని కోరలేదని, అన్ని అర్హతలు ఉన్నాయి కనుకనే విశాఖను రాజధాని నగరంగా ప్రకటించామని చెప్పారు. టీడీపీకి విశాఖపట్నంలో ఓట్లు, సీట్లు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అవసరం లేదని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉ‍ప్పుడు పట్టించుకున్నారా అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీ చేసిందేమి లేదన్నారు.

టీడీపీ నేతలు చెప్పిన అబద్దాలే పదేపదే చెబుతున్నారని మంత్రి అవంతి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ విశాఖ అభివృద్దికి కట్టుబడి ఉందని అన్నారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని గుర్తు చేశారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష  అని పేర్కొన్నారు. 

చదవండి: ‘టీడీపీ అండ్‌ కో పిచ్చి మాటలు మానుకోవాలి’

మరిన్ని వార్తలు