Minister Avanthi Srinivas: నువ్వు సినిమాల్లోనే హీరోవి.. నేను పొలిటికల్‌ హీరోని

15 Mar, 2022 11:19 IST|Sakshi

సాక్షి, అమరావతి: భీమిలి నియోజకవర్గంలో ఒక గజం భూమి తాను ఆక్రమించుకున్నానని నిరూపించినా రాజీనామా చేస్తానని మంత్రి అవంతి శ్రీనివాస్‌ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు సవాల్‌ విసిరారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదవడం తప్ప వాస్తవాలు తెలుసుకోరంటూ అంటూ పవన్‌పై మండిపడ్డారు. తమ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలపై ఎప్పుడైనా దాడులు చేశారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో జరిగిన గుండాగిరి కనపడలేదా అని నిలదీశారు.  టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావ్‌, ఎందుకు విడిపోయావ్‌ అని ప్రశ్నించిన మంత్రి అవంతి.. పవన్ ప్యాకేజీ స్టార్ అన్న సంగతి అందరికీ తెలుసని అన్నారు.

బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రానికి ఏం సాధించాగలిగావో ప్రజలకు చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పవన్‌ కల్యాణ్‌ను డిమాండ్‌ చేశారు. కుల, మతాలతో సంబంధం లేకుండా లక్షా ముప్పై వేల కోట్లు పేదల అకౌంట్‌లో వేశామని తెలిపారు. ఎక్కడైనా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి టూరిస్ట్‌గా వచ్చే పవన్‌కు ఇవన్నీ ఏం తెలుస్తాయని ఎద్దేవా చేశారు. అమరావతిని తీసేస్తామని సీఎం జగన్‌ ఎప్పుడూ చెప్పలేదని, అమరావతితోపాటు ఇతర ప్రాంతాల అభివృద్ధి గురించి కూడా చెప్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారని నిలదీశారు.
చదవండి: ఎం జగన్‌ను కలిసిన మంత్రి వెల్లంపల్లి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

‘అభివృద్ధి వికేంద్రీకరణ చేయటం తప్పా. జిల్లాల వికేంద్రీకరణ కూడా అభివృద్ధి కోసమే. వైఎస్సార్‌సీపీని ఎందుకు గద్దె దించాలి? అవినీతి లేకుండా పాలన చేస్తున్నందుకా? 2008లో మన ఇద్దరి‌ప్రస్థానం ఒకేసారి మొదలయింది. నేను మూడు సార్లు గెలిచి మంత్రి పదవి దాకా వచ్చానంటే నాలో మంచి క్వాలిటీ ఉన్నందునే. మరి నువ్వు ఎందుకు గెలవలేకపోయావ్? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. ప్రజా రాజ్యం నుంచి మేమంతా ఎందుకు బయటకి వచ్చామో తెలుసుకో. వైఎస్‌ జగన్‌కు 151 సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారో తెలుసుకో. అన్ని పార్టీలను కలపటానికి నువ్వు ఎవరు? కొన్ని లక్షల మంది జీవితాలతో ఆటలాడుకోవద్దు

టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్‌ని సీఎం చేస్తారా? నిన్ను చేస్తారా? జనసేన కార్యకర్తలు బాగా ఆలోచించుకోవాలి. సోషల్ ఇంజనీరింగ్ గురించి పవన్ మాట్లాడుతున్నారు. అన్ని వర్గాల వారికి పదవులు ఇవ్వటం సోషల్ ఇంజనీరింగ్‌గా కనపడటం లేదా? ఎమర్జెన్సీతో ఇప్పటి పరిస్థితుల గురించి మాట్లాడటంలోనే పవన్ పరిణితి లేని రాజకీయ నేత అని అర్థం అవుతుంది. 

కాపు నిర్మాతల కోసం కాల్షీట్లు ఇచ్చావా? జనసైనికులకు నీ సినిమాల్లో అవకాశం ఇచ్చావా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వారం టైం ఇస్తున్నట్లు వార్నింగ్ ఇచ్చావు. మరి తర్వాత కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదు? ఒక పొలిటికల్ లీడర్‌కు అంత గర్వం పనికిరాదు. నా గురించి నాగబాబుకి బాగా తెలుసు. ఒకసారి మీ అన్నతో నా గురించి మాట్లాడితే తెలుస్తుంది. సినిమాల్లో కూడా హిట్‌ల కంటే ప్లాపులు ఎక్కువ. నువ్వు కేవలం సినిమాల్లోనే హీరోవి. నేను పొలిటికల్‌గా హీరోని అయ్యాను.’ అని మంత్రి పేర్కొన్నారు.
చదవండి: భీమ్లానాయక్ అని బెదిరిస్తే.. భయపడేవారెవరూ లేరు: మంత్రి వెల్లంపల్లి

మరిన్ని వార్తలు