ఉనికి కోసమే బీజేపీ బహిరంగ సభ: మంత్రి బొత్స

28 Dec, 2021 13:13 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో ఉనికి‌ కోసమే బీజేపీ విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఏపీలో ఆ పార్టీ లేదన్నారు. రాజకీయ పార్టీ కాబట్టి బహిరంగ సభ నిర్వహించుకుంటోందన్నారు. విజయవాడలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తాపత్రయపడుతూ బీజేపీ ఈ రోజు సభ నిర్వహిస్తోందన్నారు.

చదవండి: ఏం మాట్లాడుతున్నారు.. బీజేపీ నేతలకు సిగ్గుందా?

ఉనికి కాపాడుకోవడానికి పెట్టే సభ తప్ప ఏమీ ఉపయోగం లేదన్నారు. గత నాలుగురోజులగా బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోనే నీతి ఆయోగ్ రాష్ట్రాలకి ర్యాంకులు ఇచ్చిందని.. బీజేపీ పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ ఏ ర్యాంకులో ఉంది.. మన రాష్ట్రం ఏ ర్యాంకులో ఉందో చూసామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఎందుకు వెనుకుబాటులో ఉందో ముందు దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటిఎస్ అనేది స్వచ్ఛంద పథకం.. ఎవరిపై బలవంతం లేదని పదే పదే చెబుతున్నా తప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి బొత్స అన్నారు.

మరిన్ని వార్తలు