చంద్రబాబుకు మంత్రి బొత్స సూటి ప్రశ్నలు

26 Sep, 2020 18:09 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కులమతాల మధ్య చిచ్చుపెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బీజేపీ అజెండాను చంద్రబాబు ఫాలో అవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలని ఆయన ఆరాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆందోళనలతో రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో మంత్రి శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తిరుమలలో ఎంతో దైవభక్తితో ఉన్నారని పేర్కొన్నారు. కావాలని డిక్లరేషన్‌పై వివాదం సృష్టించారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేరారు. ఆ వివాదం వల్ల ప్రజలకు ఏం ఉపయోగమని అన్నారు. టీడీపీ మాటలకు స్పందించాల్సిన అవసరం సీఎం జగన్‌కు లేదని స్పష్టం చేశారు.
(చదవండి: 28న 'వైఎస్సార్‌ జలకళ' పథకం ప్రారంభం)

విశాఖ ప్రజలపై చంద్రబాబుకు ఎందుకంత ద్వేషమని మంత్రి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందొద్దని చంద్రబాబు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అమరావతి కుంభకోణం నిరూపించాలంటూనే, విచారణ ఆపాలని టీడీపీ కోర్టుకి వెళ్తోందని మంత్రి గుర్తు చేశారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే విషప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ అభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగిందని తెలిపారు.  పచ్చ పార్టీ నేతలు విశాఖకు వచ్చే పెట్టుబడులపై తప్పుడు ప్రచారం చేశారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో దోచుకున్నారని ఆరోపించారు.

గంటకొకటి మాట్లాడే రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. దేవాలయాలపై దాడులు, దొంగతనాలు వెనుక ఎవరున్నా పట్టుకుని శిక్షిస్తామని చెప్పారు. తప్పు చేసినవారు శిక్ష అనుభవించక తప్పదని మంత్రి హెచ్చరించారు. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఎలా స్పందించిందనేది ముఖ్యమని చెప్పారు. ‘నాకు మాత్రం ఈ దాడుల వెనుక టీడీపీ ఉంది అనిపిస్తోంది. డీజీపీని కూడా ఆ కోణంలో విచారించాలని కోరాం. టీడీపీ హయాంలో పంచభూతాలను పంచుకుతిన్నారు. తప్పు చేయకపోతే కోర్టుకు వెళ్లి స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు’ అని మంత్రి సూటిగా ప్రశ్నించారు.
(చదవండి: జేపీ నడ్డా టీం: డీకే అరుణ, పురేందశ్వరికి స్థానం)

>
మరిన్ని వార్తలు