యనమల వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు.. మంత్రి దాడిశెట్టి రాజా కౌంటర్‌

10 Feb, 2023 18:37 IST|Sakshi

సాక్షి, తుని (కాకినాడ జిల్లా): యనమల రామకృష్ణుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘ఏపీ విద్యా విధానాలను కేంద్ర బడ్జెట్‌లోనూ ప్రస్తావించారు. అనేక విషయాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించింది. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చాం. విద్య, వైద్య రంగాలకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నాం’’ అని మంత్రి అన్నారు.

‘‘గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో టాయిలెట్లు కూడా సరిగాలేవు. నాడు-నేడు కింద రూపురేఖలు మార్చిన స్కూళ్లు గురించి తెలుసుకో. యనమల స్వగ్రామంలోనూ నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది’’ అని దాడిశెట్టి రాజా హితవు పలికారు.

‘‘యనమల వస్తే నియోజకవర్గంలో స్కూళ్లకు తీసుకెళ్తా. ఆయన అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారు. హైస్కూల్‌ వస్తే మన పొలాల్లో పనిచేసేందుకు ఎవరూ ఉండరన్నావు. యనమల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది’’ అని మంత్రి రాజా అన్నారు.
చదవండి: నారా లోకేష్‌ ఫ్లాప్‌ షో.. యువగళం ‘గండాలు’

మరిన్ని వార్తలు