హైదరాబాద్: గులాబీ గూటికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈటలపై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారని, అలానే ఇప్పుడు పార్టీ విచ్ఛిన్నానికి, వెన్నుపోటుకు ఈటల కుట్ర పన్నారంటూ దుయ్య బట్టారు. పార్టీ అప్రమత్తం కావడంతో ముప్పు తప్పిందన్నారు.
ఆత్మగౌరవం అంటూ.. ఆస్తులు కాపాడుకోవడానికే ఈటల బీజేపీలో చేరుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. తనకంటే గొప్పవాళ్ళు లేరని ఈటల బాగా ఊహించుకున్నాడని, మేకల మందపై తోడేలు పడ్డట్లు వ్యవహరిస్తున్నారని అంటున్న ఈటల.. ప్రజలు మేకలా.. మంత్రులు తోడేళ్లా.. చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల ఎన్ని కుట్రలు పన్నినా హుజురాబాద్ ప్రజలంతా తమ వెంటే ఉన్నారని, ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం అని మంత్రి గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.