ఈటలకు ఓటమి భయం పట్టుకుంది

27 Aug, 2021 04:13 IST|Sakshi

హుజూరాబాద్‌  గులాబీ జెండా అడ్డా 

ఈటల మధ్యలో వచ్చిండు మధ్యలో పోయిండు 

కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు 

వీణవంక(హుజూరాబాద్‌): ‘‘ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకుంది, నేను నియోజకవర్గానికి వస్తే ఆయనకు అంత భయం ఎందుకు? పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లి పనిచేస్తాను. ఈటల టీఆర్‌ఎస్‌ పార్టీలోకి మధ్యలోనే వచ్చిండు..మధ్యలోనే పోయిండు’’అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లి క్రాస్‌లో గురువారం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. నాడు కేసీఆర్‌ ప్రజలకోసం రాజీనామా చేశారని, మరి ఈటల ఎవరికోసం ఎందుకోసం రాజీనామా చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. రైల్వేలు, రోడ్లను అమ్మి వ్యవస్థను, ప్రభుత్వ ఆస్తులను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.  

హుజురాబాద్‌ టీఆర్‌ఎస్‌ అడ్డా.. 
2001లోనే అప్పటి కమలాపూర్‌ నియోజకవర్గంలో పార్టీ ఎంపీపీలు..జెడ్పీటీసీలు గెలిచిన చరిత్ర ఉందని, అప్పటికి ఈటల టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరలేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. హుజూరాబాద్‌  గులాబీ జెండా అడ్డా అని, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ కారుడు, పేదింటి బిడ్డ అయిన శ్రీనివాస్‌ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.   

మరిన్ని వార్తలు