రేపు వెళ్తామంటే చెప్పండి.. దగ్గరుండి తీసుకెళ్తా: భట్టికి హరీష్‌ రావు కౌంటర్‌

11 Feb, 2023 17:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌ మధ్య శనివారం వాడీవేడి వాదనలు జరిగాయి. ముందు భట్టి మాట్లడుతూ..  కాళేశ్వరానికి పెద్ద ఎత్తున ఖర్చు చేశారని అన్నారు. 18 లక్షల ఎకరాలకు బ్యారేజి కట్టారు కానీ.. నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. దేశ విదేశాల నుంచి వచ్చి చూశారంటున్నారు కానీ.. పంపులు మునిగిపోయాయని చుద్దామంటే పోనివ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

విదేశీ వాళ్లకు అనుమతి ఇస్తారు కానీ మాకు అనుమతివ్వరని భట్టి  మండిపడ్డారు. అసెంబ్లీలో తమ మైకులు కట్‌ చేసి వాళ్లకు మాత్రే ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. మమ్మల్ని కట్టేసి వాళ్లకు కొరడా ఇచ్చి కొట్టమన్నట్టుగా ఉందన్నారు.  బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఒకటి మాట్లాడితే.. మీరు మరొకటి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు ఎంత వరకు వచ్చాయని ప్రశ్నించారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. కొరడాతో తాము కొట్టడం లేదని, మీకు మీరే కొట్టుకుంటున్నారని సెటైర్లు వేశారు. కాళేశ్వరం వద్దకు రేపు వెళ్తామంటే చెప్పండి.. దగ్గరుండి తీసుకెళ్తానని అన్నారు. వరద వచ్చినప్పుడు వెళ్తే జారిపడతారని భట్టిని పంపలేదన్నారు. కాళేశ్వరం మునిగిందని కాంగ్రెస్‌ నేతలు సంబర పడుతున్నారని.. కానీ ప్రకృతి విపత్తు వచ్చిందన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా ఎజెన్సీ నుంచే రిపేర్‌ చేయించామని తెలిపారు. 

కాంగ్రెస్‌ హయాంలో పాలమూరు బిడ్డలు ఎందుకు వలస పోయారని మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు. 7 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామన్నారు. పాలమూరు గోస తీర్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 3 వేల 600 కోట్లు ఖర్చు పెట్టి 5 లక్షల ఎకరాలకు నీరిచ్చామన్నారు. తాము కట్టిన ప్రజెక్టుల వల్లే నీళ్లు వచ్చాయన్నారు.
చదవండి: ఫార్ములా ఈ రేసుకు హాజరైన మంత్రి కేటీఆర్.. అసౌకర్యంపై స్పందన

మరిన్ని వార్తలు