ఈడీ విచారణ: చెల్లి కోసం ఢిల్లీకి మంత్రి కేటీఆర్‌..

10 Mar, 2023 20:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ ఢిల్లీకి బయలు దేరారు. రేపు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతున్న క్రమంలో తన చెల్లికి నైతిక మద్దతు ఇవ్వడానికి కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే కేటీఆర్‌ ఉండనున్నారు. ఢిల్లీలో న్యాయ నిపుణులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కవిత ఈడీ విచారణ జరుగుతున్న సమయంలో కేటీఆర్‌ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, కవిత విచారణ నేపథ్యంలో మరో ఏడుగురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు కవిత విచారణకు ముందే సిసోడియా రిమాండ్‌ రిపోర్ట్‌తో ఈడీ సంచలనం సృష్టించింది. సిసోడియా రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత పేరు ప్రస్తావించింది.

ఇదిలా ఉండగా, కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. ‘‘రేపు విచారణ పేరుతో కవితను అరెస్ట్‌ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం’’ అంటూ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారు. కవితను కూడా చేరమన్నారు. ​​​మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు’’ అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు.
చదవండి: రేపు కవితను అరెస్ట్‌ చేయొచ్చు: సీఎం కేసీఆర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు