నాబార్డ్ చైర్మన్ వస్తున్నారని తెలిసి టీడీపీ బ్యాచ్ సిద్ధమైంది: కన్నబాబు

2 Mar, 2022 21:20 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం విన్నూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నారని నాబార్డ్ చైర్మన్ ప్రశంసించినట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి కూడా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అనేక అంశాలను ప్రస్తావించారని జీఆర్ చింతల అన్నారు. గత ఏడాది కంటే నాబార్డ్ సహకారం మరింతగా ఉంటుందని ఆయన చెప్పారు. సహకార బ్యాంకుల సేవలను కూడా ఆర్బీకేలకు అనుసంధానం చేయమని సీఎం జగన్‌ చెప్పారు. రూ.16వేల కోట్లతో ప్రతి గ్రామంలో వ్యవసాయ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 

చంద్రబాబుకి వారసత్వంగా లోకేష్, అచ్చెన్నాయుడు
ఓ వైపు ఇవన్నీ జరుగుతుంటే నాబార్డ్ చైర్మన్ వస్తున్నారని తెలిసి టీడీపీ బ్యాచ్ సిద్ధమైంది. రైతు సదస్సు పేరుతో సీఎంపై బురద జల్లడానికి అచ్చెన్నాయుడు ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ఎక్కడ ప్రకటించారో చూపించాలి. ఆనాడు వాళ్లు క్రాప్ హాలిడే ఇస్తే రైతులు ఆందోళనను పోలీసులతో అనగదొక్కించారు. చంద్రబాబుకి వారసత్వంగా లోకేష్, అచ్చెన్నాయుడు తయారయ్యారు. అచ్చెన్నాయుడు అబద్దాల్లో పుట్టిపెరిగినట్లుంది. ఆయన సీఎంపై మాట్లాడుతున్న బాష ఏమిటి..?. మూర్కుడు పరిపాలిస్తున్నాడు అంటారా..?. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన ఎలాంటి వారో ప్రజలకి తెలుసు. చంద్రబాబు ఎలా ఉంటే అందరూ అలా ఉంటారనుకుంటే ఎలా..?. అధికారంలో ఉంటే చంద్రబాబు నమస్కారం పెట్టినా ప్రతినమస్కారం పెట్టడని మీ పార్టీ వారే చెప్తున్నారు. 160 సీట్లొస్తాయని చెప్పుకుంటున్నారు. వాటిని పగటి కలలు మాత్రమే అంటారు. ఈ మధ్య మేమొస్తాం.. మీ సంగతి తెలుస్తాం అని బాగా చెప్పుకుంటున్నారు.

చదవండి: (అందుకే వివేకా అల్లుడు ఆదినారాయణరెడ్డితో స్నేహం చేశాడు: తోపుదుర్తి)

వ్యవసాయ రంగంలో ఏపీ అగ్రగామి
దేశంలో ఏపీ వ్యవసాయంలో అగ్రగామిగా ఉందని కేంద్రమే చెప్తోంది. మీరెన్ని సోకాలు పెట్టినా వ్యవసాయ రంగంలో ఏపీ అగ్రగామి అయ్యి తీరుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు వ్యక్తిగత పనిముట్లు ఇవ్వనున్నాం. త్వరలో రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు రైతులకు అందించనున్నాం. వచ్చే ఏడాది నుంచి మార్కెట్ యార్డులను నాడు- నేడు కింద అబివృద్ది చేయనున్నాం. రాబోయే రోజుల్లో మీ ఊహకందని రీతిలో వ్యవసాయ రంగం అబివృద్ది చెందుతుంది. ఒక్క టీడీపీ మాత్రమే ఏ వర్గం సుఖంగా ఉండకూడదు అని కోరుకుంటుంది. ఉద్యోగుల వల్ల 2019లో ఓడిపోయాం అని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఉద్యోగ సంఘాలు మాపై మాట్లాడితే ఆహా అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే ఉద్యోగులను తిడతారు. 

రాత్రికి రాత్రి గుడారం ఎత్తేశారు
మూడు రాజధానులు ఉపసంహరించుకున్నాక ఎవరైనా రాజధాని అమరావతి అంటారు. కొన్ని కారణాల వల్ల ఆ బిల్లును ఉపసంహరించుకున్నాం. కేంద్రం రాజధాని అభివృద్ధికి నిధులు ఇస్తుంది. ప్రభుత్వ పరంగా దీనిపై చర్చ జరుగుతుంది. దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాం. అమరావతి భూములపై ఎవరికి శ్రద్ధ ఉందో దేశమంతా తెలుసు. రాత్రికి రాత్రి గుడారం ఎత్తి ఇక్కడకు వచ్చి ఒక్క రోడ్డేసిన పాపాన పోలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అమరావతిలో చంద్రబాబు చేసింది ఏమీ లేదు. కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిన తరుణంలో అప్పులు అనివార్యంగా చేయాల్సి వచ్చింది. కేంద్రంతో సహా అన్ని రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మీరేం సాధించారు. మీరు తెచ్చిన అప్పులతో ఒక్కరికైనా లబ్ది చేకూర్చారా..? 

చదవండి: (వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు: సీఎం జగన్‌)

దీన్నే దమ్మున్న నాయకత్వం అంటారు
సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వను అని అన్న పెద్దమనిషి ఎవరు. ఇప్పుడు ఎవరూ డిమాండ్ చేయకముందే ఆ కేసును మేము సీబీఐకి రెఫర్ చేశాం. దీన్నే దమ్మున్న నాయకత్వం అని అంటారు. మీకు సీబీఐ గురించి మాట్లాడే అర్హత ఉందా..?. వాళ్లిచ్చిన లీకులను పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చు వేసుకొని మీరెలా మాట్లాడతారు. ఏ రోజైనా సీబీఐ విచారణ అపమని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా..?. అంతర్వేది సంఘటనను కూడా సీబీఐ విచారణ చేయాలని కోరాము. మీరు బంతిని నెలకేసి కొడితే ఎలా లేస్తుందో జగన్ అలానే లేస్తాడు. జగన్‌ను తగ్గించాలని చూసిన ప్రతి ప్రయత్నంలో ఆయన పైకి లేచారు' అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. 

మరిన్ని వార్తలు