‘కదులుతున్న ‘మార్గదర్శి’ అక్రమాల డొంక.. రామోజీ బెంబేలు’

28 Mar, 2023 19:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీ బెంబేలెత్తుతున్నారని.. అందుకే దళితులపై దమనకాండ అంటూ ‘ఈనాడు’ అడ్డగోలు రాతలు రాస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘మార్గదర్శి కేసులో ప్రధాన ముద్దాయి రామోజీరావు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వంపై బురదజల్లే రాతలు. ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే రామోజీకి పరాభవం తప్పదు. బాబు, రామోజీ ముసుగు దొంగలు’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు.

‘‘దళితులపై దమనకాండ జరిగింది బాబు హయాంలోనే.. దళితులను అడ్డుపెట్టుకుని మా ప్రభుత్వంపై బురదచల్లుతావా?. టీడీపీ హయాంలో కారంచేడు, దళితుల ఊచకోత ఘటనలపై రామోజీ ఎందుకు కథనాలు రాయలేదు..?. గరగపర్రులో దళితుల వెలివేత, పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటనలు రామోజీ కళ్లకు కనిపించలేదా?. అచ్చెన్న మహిళను కాలితో తంతే.. మీకు ముచ్చటగా అనిపించిందా..?. సీఎం జగన్‌ పాలనలో దళితులకు జరుగుతున్న మేలు రామోజీకి అట్రాసిటీగా కనిపిస్తుందా..? ఫిల్మ్ సిటీలో దళితుల భూములను కొట్టేసింది రామోజీనే’’ అంటూ మంత్రి నాగార్జున దుయ్యబట్టారు.

మంత్రి నాగార్జున ఇంకా ఏమన్నారంటే..:

రామోజీ.. ఇవేనా జర్నలిజం విలువలు..?
రామోజీరావు, ఈనాడు పేపర్‌ పెట్టుకున్న తర్వాత ఇన్నేళ్లకు దళితులు గుర్తుకొచ్చారా..? ఈరోజు రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నట్లు కథనాలు రాయడానికి ఆయనకు సిగ్గుందా..? అని అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో దళితులపై ఏ విధంగా దాడులు, అఘాయిత్యాలు, వెలివేతలు, జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసిన సంఘటనలపై కథనాలను ఎందుకు రాయలేదు రామోజీ..? ఇదేనా మీ జర్నలిజం విలువలు..?. కారంచేడులో దళితులపై దాడులు జరిగినప్పుడు.. అప్పుడు జరిగిన అగ్రవర్ణాల అహంకారం గురించి ఈనాడు ఎందుకు రాయలేదు..? ఆరోజు దళితులపై జరిగిన దమనకాండకు కారకులైన వారి గురించి ఇప్పుడు రాయొచ్చు కదా.. రామోజీరావు సొంత సామాజికవర్గానికి చెందిన వారు దళితులపై మారణకాండ జరుపుతున్నప్పుడు .. ఇది తప్పు అని ఎందుకు రాయలేదు..? అని ప్రశ్నిస్తున్నాను. 

బాబు, రామోజీ ముసుగుదొంగలు
ఎందుకంటే.. తన రాతలతో చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి జరగాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఈనాడు ముసుగులో నువ్వు వ్యాపారాలు చేయాలి. మార్గదర్శి ఎవరిది..? అందులో వ్యాపార భాగస్వాములు ఎవరు..? ఎవరి డబ్బులతో రామోజీరావు వ్యాపారం చేస్తున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసులో.. ప్రస్తుతం సీఐడీ  ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేశారు. రేపు మార్గదర్శి కేసులో ఈనాడు రామోజీరావు ప్రధాన ముద్దాయి అవుతున్నాడని .. ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడు.  అందుకే, ఇప్పుడు దళితులపై దాడులంటూ.. తప్పుడు కథనాలు రాస్తున్నాడనేది పచ్చి నిజం.

మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల డొంక కదిలేకొద్దీ.. రామోజీకి బుర్ర పనిచేయడం లేదు. మార్గదర్శి చిట్ ఫండ్ పేరుతో.. జనం సొమ్మును తన వేరే వ్యాపారాలకు విస్తరించి, చిట్స్ వేసిన ఖాతాదారుల జీవితాలతో చెలగాటమాడుతున్నది రామోజీనే. రామోజీ చిట్స్- చీటింగ్ బాగోతాన్ని సీబీసీఐడీ అధికారులు తవ్వి తీస్తుంటే.. ఆయనకు, ఆయనకు వకాల్తా పలుకుతున్న చంద్రబాబు, దుష్ట చతుష్టయానికి కడుపు రగిలిపోతుంది.

ఫిల్మ్ సిటీలో దళితుల భూములు కొట్టేసిన రామోజీరావు
రామోజీఫిల్మ్‌సిటీ నిర్మాణానికి సంబంధించి దళితుల భూముల్ని కబ్జా చేసినట్లు రామోజీరావుపై పలు కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పటికీ కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి ఈరోజు దళితులపై ప్రేమ పుట్టుకొచ్చినట్లు,  ఈ రాష్ట్రంలో ఎవరో దళిత డాక్టర్లపై దాడులు జరుగుతున్నట్లు తప్పుడు రాతలతో నీచమైన మనస్తత్వాన్ని రామోజీరావు ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇటువంటి దౌర్భాగ్యపు రాతలతో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ లకు రాజకీయంగా పట్టం కట్టాలనుకుంటే వారి ప్రయత్నాలు ఫలించేదే లేదు. రాజకీయాల్లో చంద్రబాబు ఒక దొంగ అయితే.. ఆయన్ను భుజానెత్తుకుని విషపురాతలు రాసే రామోజీరావేమో గజదొంగ అని చెప్పుకోవాలి. ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టే రాతలు మానుకోకపోతే ఈనాడు రామోజీరావుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాను. 

చంద్రబాబు హయాంలో దళితులపై అరాచకాలు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దళితులు అలో లక్ష్మణా.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సీ, ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులు, అఘాయిత్యాలు జరిగినప్పుడు పోలీసుస్టేషన్‌ల చుట్టూ తిరిగి కేసులు పెట్టమని రోధిస్తే ఏ ఒక్కడూ పట్టించుకున్న దాఖలాల్లేవు. అచ్చెన్నాయుడు మహిళను కాలుతో తంతే ఎందుకు కేసు పెట్టలేదు..? గరగపర్రులో దళితులు వెలివేత కేసు ఏంచేశారు..? పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన కేసుకు సంబంధించి పెందుర్తి పోలీసుస్టేషన్‌ ముందు ధర్నాకు దిగితే.. ఆ కేసుల్ని ఏం చేశారు..? వాటిని ఎందుకు అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు..?  ఈ ఘటనలపై ఈనాడులో వరుస కథనాలు ఎందుకు రాయలేదో.. రామోజీరావు సమాధానం చెప్పాలి..? ఇవన్నీ ఈనాడుకు ముచ్చటగా అనిపించాయా..? 

దళితుల మేలుపై చర్చకొస్తారా..?  
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సుభిక్షమైన పరిపాలన జరుగుతోంది. రాజ్యాంగ బద్ధంగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆలోచనా విధానంతో సుభిక్షమైన పరిపాలన అందజేస్తుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా సంక్షేమపథకాలతో సంతోషంగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత దళితుల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం గురించి మంచిగా ఆలోచించే ముఖ్యమంత్రి వచ్చారని వైఎస్‌ జగన్‌ని ప్రతీ పేదోడి ఇంట్లో దేవుడుగా కొలుస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబుకు, రామోజీరావుకు కన్నుకుట్టే విషయమైంది. దళితుల రక్షణకు, వారి మేలుకు మేం బాధ్యతగా పనిచేస్తున్నామని దమ్ముగా చెబుతున్నాను. అడ్డగోలు రాతలకు, నీచమైన రాతలకు ఈనాడు వేదికగా ఉంది. దళితులకు ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో...  మీరు చర్చకు రాగలరా..?

అట్రాసిటీ అంటే అర్ధమేంటి..?
ఈనాడు మాత్రం ‘దళితులపై దమనకాండ’ అంటూ విషప్రచారానికి పూనుకుంటుంది. అసలు అట్రాసిటీ అంటే రామోజీరావు దృష్టిలో ఏంటి..? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లీషుమీడియం తీసుకొచ్చి పేదపిల్లలకు చదువు చెప్పడాన్ని అట్రాసిటీ అంటారా..? రాజధాని ప్రాంతంలో భూముల్ని పేదలకు ఇస్తామంటే.. ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని టీడీపీ అడ్డుకోవడాన్ని అట్రాసిటీ అంటారా..?

కొన్ని లక్షల కోట్లు డీబీటీ రూపంలో దళితులకు సంక్షేమపథకాల కింద నేరుగా మా ప్రభుత్వం అందజేస్తుంటే అది అట్రాసిటీనా..?. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 68శాతం రాజకీయ పదవులిచ్చి అత్యున్నత స్థానాల్లో నిలబెట్టడాన్నిరామోజీరావుకు అట్రాసిటీగా కనిపిస్తున్నాయా.?. పేదోడికి గూడును కల్పిద్దామని.. వారికి ఉచితంగా ఇంటి స్థలమిచ్చి రుణసాయంతో ఇల్లు నిర్మించడమే కాకుండా వారికి ఉపాధిచూపాలని తపనపడే ప్రభుత్వం మీకు అట్రాసిటీకి పాల్పడుతున్నట్లు కనిపిస్తుందా..?  పేదవాళ్లకు సాయం చేయడం అనేది నీకు, నువ్వు అండగా ఉండే నీ నాయకుడు చంద్రబాబుకు చేతగాదు. పేదవాళ్లను అక్కునజేర్చుకుని భావితరాల భవిష్యత్తుకోసం మా ప్రభుత్వం గొప్ప పరిపాలన అందిస్తుంటే.. అది రామోజీరావుకు అట్రాసిటీగా కనిపిస్తుందా..?

దళితులకు ‘బాబు’చేసిన మోసం గురించి ఎందుకు రాయవు..?
చంద్రబాబు హయాంలో ఐదు ఏళ్లలో, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.33,625.49 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపితే.. ఆ డబ్బు దళితులకు దేనికోసం ఖర్చుచేశారో.. అందులో అవినీతి ఎంత జరిగిందో.. ఎంతమంది చేతులు మార్చుకున్నారో.. ఈ కుంభకోణాలపై కథనాలు రాసే దమ్ము రామోజీరావుకు ఉందా..? అని అడుగుతున్నాను. అదే మా వైస్సార్‌సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలనలో ఫిబ్రవరి మాసాంతానికి దళితుల సంక్షేమానికి రూ.51,293 కోట్లు ఖర్చుచేశాం. డీబీటీ ద్వారా ఒక్క పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అయితే.. వీటిమీద రాతలు రాయడానికి చేతులు కదలడం లేదా రామోజీరావు..? అని అడుగుతున్నాను.
చదవండి: లోకేష్‌కు ఆ సంగతి తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారా? 


 

మరిన్ని వార్తలు