ప్రాజెక్టులకు చంద్రబాబు బద్ధ వ్యతిరేకి: మంత్రి పెద్దిరెడ్డి

19 Jul, 2021 14:56 IST|Sakshi

చిత్తూరు: సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు బద్ధ వ్యతిరేకి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గాలేరు నగరి ప్రాజెక్టుకు హంద్రీనీవాకు అనుసంధానం చేసి కుప్పం నియోజకవర్గానికి కూడా సాగునీరు అందించడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే రూ.550 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. తాగునీటి కోసం ప్రత్యేక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా అభివృద్ధికి సీఎం జగన్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాలో సోమవారం జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన యువతకు పలు సూచనలు చేశారు. దేశ భద్రత కోసం యువకులు పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సైన్యంలో చేరడానికి యువకులు ఆసక్తి చూపాలని సూచించారు. సీఎం జగన్‌ కూడా యువకుల భవిష్యత్తు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. యువతలో నైపుణ్య లక్షణాల అభివృద్ధికి ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారని గుర్తు చేశారు. ఆ విశ్వవిద్యాలయం చిత్తూరు జిల్లాలో ఏర్పాటు కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రతి యువకుడికి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు