బీజేపీ నేతలు నీతులు చెప్పడం విడ్డూరం: పేర్ని నాని

8 Nov, 2021 15:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాకెట్‌ కంటే వేగంగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలను కేంద్రం పెంచుతోందన్నారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలపై జాలి, దయ లేకుండా ధరలు పెంచుతున్నారు. రూ.70 పెట్రోల్‌ను రూ.110కి తీసుకెళ్లారు. ఇప్పుడు 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు.

చదవండి: అలాంటి ఫలితాలే రానున్నాయి: కాసు మహేష్‌రెడ్డి 

అక్టోబర్‌లో ధర ఎంత ఉంది? నవంబర్‌లో ఎంత ఉంది. కేంద్రం చేస్తున్న దోపిడీ ప్రజలకు తెలియదా? బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలి. రూ.5 కాదు రూ.25 తగ్గించాలని మోదీని డిమాండ్‌ చేయాలి. సెస్‌ రూపంలో కేంద్రం 2.85 లక్షల కోట్లు వసూలు చేసింది. బీజేపీ నేతలు ధర్నా చేస్తే నేను కూడా ఢిల్లీ వస్తా. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచింది. ప్రజలపై జాలితో 5 రూపాయలు తగ్గించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు ఎలా ఖర్చు చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా. సంక్షేమ పథకాలపై ఏపీ చేస్తున్న వ్యయం మీకు కనిపించలేదా?. గ్యాస్‌ ధర ఎంత ఉండేది.? ఇప్పుడు ఎంత చేశారు.? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.

చదవండి: Kuppam Municipality: కుప్పంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి..

సీఎం జగన్‌ పాలనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. వరుస ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే ప్రజాదరణకు నిదర్శనం. ప్రభుత్వంపై బురదజల్లేందుకే టీడీపీ పరిమితమవుతోంది. బీజేపీ,టీడీపీల తప్పుడు విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పేర్ని నాని అన్నారు.

మరిన్ని వార్తలు