‘చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే ప్రమాదానికి కారణం’

29 Dec, 2022 14:50 IST|Sakshi

సాక్షి, తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే ఎనిమిది మంది అకారణంగా మృతిచెందారు. తన సభ సక్సెస్‌ కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు అని రోజా అన్నారు. 

కాగా, మంత్రి ఆర్కే రోజా కుటుంబ సమేతంగా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం, ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీటింగ్‌లో‌ జరిగిన ఘటన చూస్తుంటే చాలా బాధ వేస్తోంది. చంద్రబాబు తన సభ సక్సెస్‌ కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబును ఏం అనాలి?. చంద్రబాబు బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎనిమిది మందిని బలిగొన్న చంద్రబాబుపై కోర్టులు సుమోటో కేసుగా స్వీకరించాలి. ఇది రాజకీయ హత్య.. కోర్టులు సుమోటోగా స్వీకరించి కేసు పెట్టాలి. 

మీటింగ్ జరిగే సమయంలో భద్రతా ఏర్పాట్లు ఉండాలి. కానీ, అవేవీ లేకుండా చంద్రబాబు సభలు, రోడ్‌షోలు అంటూ పచ్చ ఛానల్స్‌లో చూపించుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అధికారంలో‌ ఉన్న సమయంలో పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల సమయంలో 29 మంది ప్రాణాలను తీశాడు. ఇప్పుడు ఇలా 8 మంది ప్రాణాలను బలిగొన్నాడు అంటూ రోజా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు