Konaseema Issue: చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నాడు: మంత్రి రోజా

25 May, 2022 17:30 IST|Sakshi

సాక్షి, అమరావతి:  కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే గొడవ చేయటం బాధాకరమని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లు తగలబెట్టడం అన్యాయమన్నారు. దాడి చేసిన వారిలో 50 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అమలాపురం అల్లర్లపై కేసు విచారణ జరుగుతోందన్నారు. తప్పు చేసిన వారిని విడిచిపెట్టే ప్రస్తకే లేదన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనపై బురద చల్లడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.

అంబేద్కర్‌ వలనే మనమంతా క్షేమంగా ఉన్నామని, అలాంటి అంబేద్కర్‌ పేరు పెడితే గొడవలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు లాగుతామని తెలిపారు. ఇవే ప్రతిపక్షాలు గతంలో అంబేద్కర్ పేరు పెట్టాలని నిరాహారదీక్షలు చేశారని గుర్తు చేశారు. సూసైడ్ చేసుకుంటామంటూ టీవీల ముందుకు వచ్చిన వారు.. జనసేన పార్టీ నేత పవన్‌తో ఎంత క్లోజ్‌గా ఉన్నారో తెలుస్తోందన్నారు. చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నారని, ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
చదవండి: పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు?

‘మేమే చేయించాం అని అంటున్నారంటే చంద్రబాబు స్క్రిప్ట్‌ను ఎలా చదువుతున్నాడో తెలుస్తోంది. అప్పట్లో తుని ఘటనలో వైఎస్సార్‌ సీపీ వాళ్లు ఉంటే మీ పాలనలో ఎందుకు అరెస్టు చేయలేకపోయారు? కోనసీమలో ప్రజలు భయపడాల్సిన పనిలేదు. దీని వెనుక ఎవరు ఉన్నారో ప్రజలు గ్రహించాలి. పోలీసులకు దెబ్బలు తగిలినా కష్టపడి పని చేశారు. వారు ఓట్ల కోసం మీ దగ్గరకు వస్తే మూతి పగిలేలా తీర్పు ఇవ్వండి. దావోస్ పర్యటన ద్వారా ఏపీకి పెట్టుబడులు తెస్తున్నారు. సీఎం జగన్‌ రాష్ట్రంలో లేరని ఇలాంటి కుట్రలు చేస్తే కుదరదు. ఆయన ఎక్కడ ఉన్నా ఆ చూపంతా ఏపీలోనే ఉంటుంది’ అని మంత్రి రోజా చెపపారు.
చదవండి: అమలాపురం అల్లర్లపై స్పీకర్‌ సీరియస్‌.. అప్పుడుంటది బాదుడే బాదుడు!

మరిన్ని వార్తలు