చంద్రబాబు, పవన్‌ భేటీపై మంత్రి రోజా ట్వీట్‌

8 Jan, 2023 17:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, దత్తపుత్రుడు జనసేన పవన్‌ కల్యాణ్‌ మధ్య ముసుగు తొలగిపోయింది. జీ హుజుర్‌ అంటూ చంద్రబాబుతో మరోసారి పవన్‌ భేటీ అయ్యారు. ఆదివారం పవన్‌ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు.

వీరిద్దరి భేటీపై మంత్రి ఆర్కే రోజా స్పందిస్తూ.. ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘విశాఖలో మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్‌ను పరామర్శిస్తాడు. చంద్రబాబు సభల్లో 11 మంది చనిపోతే పవన్‌ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడు. వీళ్ల దృష్టిలో ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా!’’ అంటూ రోజా ట్వీట్‌ చేశారు.

పవన్ వెళ్లింది.. అందుకే..: మంత్రి సురేష్‌
ప్రకాశం జిల్లా: చంద్రబాబు, పవన్ కలయిక పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళింది.. బాబూ జీ హుజూర్ అని అనడానికేనని మంత్రి సురేష్ విమర్శించారు. ‘‘నువ్వు ఎన్ని సీట్లలో పోటీ చేయమంటే.. అన్ని సీట్లలో పోటీ చేస్తాను.. నువ్వు ఏది చెబితే అది చేస్తాను అని చెప్పడానికే’’ అంటూ ఎద్దేవా చేశారు.

ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే జీవో నంబర్ 1 ప్రభుత్వం జారీ చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కానీ ఎల్ల్లో మీడియా జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇచ్చి వాస్తవాలను వక్రీకరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఎంత మంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. జగన్ సింహలా సింగిల్ గానే పోటీ చేస్తారని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు