బాబు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు: ఎమ్మెల్యే

15 Sep, 2020 15:43 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కుంభకోణం సృష్టించారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో అమరావతిలో చంద్రబాబు అతి పెద్ద స్కాం చేశారని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట 4,500 ఎకరాల భూమిని దోచేశారని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పుడే చెప్పారన్నారు. లక్షల కోట్లు ఆర్జించడానికి పేద రైతులను రాజధాని చంద్రబాబు మోసం​ చేస్తున్నారని తాము ప్రతిపక్షంలో ఉండగానే చెప్పామని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే సమగ్ర విచారణ చేస్తామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా విడిచే ప్రసక్తి లేదని అప్పుడే పేర్కొమన్నారు. చంద్రబాబు తన బినామీల పేరు మీద 4,500 ఎకరాలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. (చదవండి: ఏసీబీ కేసు.. శుభ పరిణామం)

అమరావతి రాజధాని స్కాంకు ఆధ్యుడు చంద్రబాబేనని, ఇందులో తన పేరు లేదు, సంబంధం లేదు అని చెప్పినా విడిచే ప్రసక్తి లేదన్నారు. తన భూములు ఉన్న చోట రియల్‌ ఎస్టేట్‌ జోన్‌ అని లేని ఏరియా అగ్రికల్చర్‌, గ్రీన్‌ జోన్‌గా బాబు ప్రకటించారన్నారు. రాష్ట్రానికి బాబు చేసిన ఆరాచకం, అన్యాయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, దర్యాప్తులో తప్పు అని తేలిన ప్రతి వ్యక్తికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అందులో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు అని తాము భావిస్తున్నామన్నారు. దళితులకు కేటాయించిన భూములను సైతం టీడీపీ నేతలు లాక్కున్నారని, చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఎవరూ చేసిన తప్పులకు వారే బాధ్యులని త్వరలో ఏసీబీ విచారణలో నిజాలు నిగ్గు తెలుతాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
(చదవండి: టీడీపీ బాత్‌రూంలను కూడా వదల్లేదు: సోము వీర్రాజు)

మరిన్ని వార్తలు