అప్పులు, దోపిడీలో తెలంగాణ ఫస్ట్‌

26 Dec, 2022 03:33 IST|Sakshi

లింగాలఘణపురం: అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పే సీఎం కేసీఆర్‌ మాటలన్నీ బూటకమని, అప్పులు చేయడం, దోపిడీకి పాల్పడటంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. ఆదివారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మద్యంతో రూ.10,700 కో ట్ల ఆదాయం వస్తే.. నేడు ఏడాదికి రూ.45 వేల కో ట్ల ఆదాయం వస్తోందన్నారు. అందులో పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతు బంధుకు రూ.25 వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారని, మిగిలిందంతా కల్వకుంట్ల కుటుంబమే దోచుకుంటోందన్నారు. తాగుడులో తెలంగాణ ముందుందని, ప్రతీ కుటుంబంలో తాగు డు వ్యసనంగా మారి అనారోగ్యం పాలవుతున్నారని, 6.70 లక్షల మంది మద్యం కారణంగా చనిపోయారని, దీంతో ఆ కుటుంబాలు వీధినపడ్డా కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్నారు.

రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే.. వర్షాలు, వరదలకు కన్నెపల్లి, అన్నారం పంపుసెట్లు ధ్వంసమయ్యాయన్నారు. నష్టాన్ని అంచనా వేసేందుకు సైతం అక్కడికి ఎవరినీ వెళ్లనీయడం లేదన్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది కేసీఆర్‌ను బొందపెడతారని అన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొనే అవకాశాలు ఉన్నాయా అని విలేకరులు ప్రశ్నించగా.. ఏ పార్టీ ఎక్కడైనా పోటీచేసే అవకాశం ఉంటుందని, పొత్తుపై ఆ పార్టీ నాయకులనే అడగాలని ఈటల విలేకరులకు సూచించారు. 

మరిన్ని వార్తలు