మళ్లీ అదే తప్పు చేసేది లేదు.. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం: ప్రసాదరాజు

14 Sep, 2022 16:51 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అభివృద్ధితో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మొహం చూపించలేకే చంద్రబాబు సభకు రావడం లేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదనూరి ప్రసాదరాజు అన్నారు. చర్చ అంటూ ప్రతిపక్షం బయట సవాళ్లు విసరడం కాదు.. సభకు వచ్చి చర్చించాలని కోరారు. ఈ మేరకు ప్రసాదరాజు మీడియాతో మాట్లాడుతూ.. 'రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. పది గంటలకు బీఏసీ సమావేశం జరుగుతుంది. అజెండా ఫిక్స్‌ అవుతుంది. అనేక కీలక అంశాలను ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నాము.

ప్రతిపక్షాలు కూడా సభకు రావాలని నేను కోరుకుంటున్నా. సభలో ఎటువంటి చర్చకైనా మేము సిద్ధం. వాళ్ల దగ్గర మాట్లాడటానికి ఏమీ లేక గైర్హాజరవుతున్నారు. అమరావతి పాదయాత్ర ఉద్దేశ్యం ఏమిటో దాని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. ఒకసారి హైదరాబాద్‌ కోల్పోయి మన రాష్ట్రం నష్టపోయింది. మళ్లీ మళ్లీ అదే తప్పు చేసేది లేదు.. అభివృద్ది వికేంద్రీకరణే మా విధానం. దానికోసమే మేము కట్టుబడి ఉన్నాం.. మూడు రాజధానులు పెట్టి తీరతాం' అని ముదనూరి ప్రసాదరాజు వ్యాఖ్యానించారు.

చదవండి: (దమ్ముంటే అసెంబ్లీకి రా.. చంద్రబాబుకు పార్థసారథి సవాల్‌)

మరిన్ని వార్తలు