ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

17 Mar, 2023 01:55 IST|Sakshi

రిటర్నింగ్‌ అధికారి చేతుల మీదుగా ముగ్గురికి ధ్రువీకరణ పత్రాలు

ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసిన చల్లా, దేశపతి, నవీన్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు కుర్మయ్యగారి నవీన్‌రావు, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఆ ముగ్గురు అభ్యర్థులు గురువారం అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్‌ అధికారి చేతుల మీదుగా ధ్రువీకరణపత్రాలు అందుకున్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ముగ్గురు నేతలు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు నవీన్‌రావు, గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ఈ నెల 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక కోసం ఈ నెల 7న నోటిఫికేషన్‌ విడుదల కాగా అదేరోజు సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు.

ఈ నెల 9న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా నవీన్‌రావు, దేశపతి శ్రీనివాస్‌ చల్లా వెంకట్రామిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికాగా, బీఆర్‌ఎస్‌కు ఆ ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.


 

మరిన్ని వార్తలు